సంక్రాంతి సందడి

14 Jan, 2015 01:37 IST|Sakshi
సంక్రాంతి సందడి

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను మంగళవారం గుంటూరులోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలు దువ్వుతున్న పందెం కోళ్లతో స్పీకర్ కోడెల, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చిత్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, మంత్రి రావెల, నన్నపనేని రాజకుమారి, కలెక్టర్, జేసీ తదితరులు
 
సాక్షి, గుంటూరు : జిల్లా కేంద్రం గుంటూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మంగళ వారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ స్టేడియంలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలు ఆహూతులను అలరించాయి. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అధ్యక్షత వహించారు.

స్పీకర్ కోడెల మాట్లాడుతూ, సంక్రాం తిని అందరి పండుగగా అభివర్ణించారు. ఠవ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆశీస్సులతో 1.31 కోట్ల మందికి సంక్రాంతి కానుకగా  చంద్రన్న సరుకులు పంపించామన్నారు.  ఎక్కువ దిగుబడి సాధించిన రైతులకు చంద్రన్న పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.
 
మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాలు సంతోషంతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రన్న కానుకను పంపించారని పేర్కొన్నారు.
 
కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబం పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో 12.79 లక్షల రేషన్‌కార్డులకు చంద్రన్న సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
 
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు చక్కని స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, రాయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మద్దాలి గిరితో పాటు పలువురు పాల్గొన్నారు.
 
ఆకట్టుకున్న స్టాల్స్ ...
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. పశువుల అందాల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.   మత్స్యశాఖ ఏర్పాటు చేసిన చేపల ప్రదర్శన, ఉద్యానవన శాఖ పండ్ల ప్రదర్శన, నెడ్‌క్యాప్ సౌరవిద్యుత్ పరికరాలు, ఐసీడీఎస్ పిండి వంటలు, కోడి పుంజుల ప్రదర్శన కబడ్డీ పోటీలు, రంగవల్లులు, బొమ్మల కొలువు, వేడుకలు తిలకించేందుకు వచ్చిన ప్రతిఒక్కరినీ అబ్బురపరిచాయి.
 
రైతులకు పురస్కారాలు
గుంటూరు స్పోర్ట్స్ :  సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతు అవార్డులను పి.రామ కృష్ణ, (మండేపూడి అమరావతి మండలం) మేకల లక్ష్మీనారాయణ (రావెల, తాడికొండమండలం), ముత్తవరపు సిద్ధార్థ వెంకటరామయ్యలకు అందజేశారు.

జిల్లా స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులు వ్యవసాయ శాఖ-ముదావత్ సోమలనాయక్, పెద్ది నరసింహారావు, గుత్తికొండ రామాంజనేయులు, మాదాల సురేంద్ర, జాష్టి హరిబాబు. పశు సంవర్ధక శాఖ- కొలసాని రమణమూర్తి, కుంట వెంకటకోటయ్య, చేకూరి జార్జిబాబు. ఉద్యానవన శాఖ-1- పొన్నెకంటి శ్రీరాంబాబు. ఉద్యానవన శాఖ-2- మేక దివాకర్ చౌదరి. పట్టు పరిశ్రమల శాఖ- పారా వెంకటేశ్వర్లు. మత్స్యశాఖ- పెనుమచ్చు నాగరాజు, మంతెన కరుణరాజు. విద్యుత్‌శాఖ- ముద్దులూరి చంద్రశేఖర్.  సూక్ష్మ నీటి పథకం- నెక్కంటి కృష్ణప్రసాద్‌లకు సంక్రాంతి పురస్కారాలను అందజేశారు.

ఉత్తమ అధికారులుగా వ్యవసాయ శాఖకు చెందిన పి.రామాంజనేయులు, ఎన్.సరళ, వి.బుష్‌లు. పశు సంవర్ధక శాఖ- కె.చంద్రశేఖర్‌రెడ్డి, మత్స్యశాఖ - ఎ.వి.రాఘవరెడ్డిలు. బ్యాంకింగ్ రంగం- కె.శ్రీనివాసులు, జె.ఆంజనేయులు చంద్రన్న పురస్కారాలు అందుకున్నారు.

మరిన్ని వార్తలు