ఆంధ్రజ్యోతి ఎండీకి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

14 Aug, 2014 02:20 IST|Sakshi
ఆంధ్రజ్యోతి ఎండీకి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

ఖమ్మం లీగల్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఖమ్మం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.సునీతారాణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన  పూసా నరేందర్ 2010 సంవత్సరంలో కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఖమ్మం కోర్టుకు బుధవారం  రాధాకృష్ణ హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన రాకుండా ఇద్దరు న్యాయవాదుల ద్వారా ఇద్దరు పూచీదారులను హాజరుపరిచారు. దీంతో, ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ.. వచ్చే నెల 10వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసింది.

వేమూరి రాధాకృష్ణపై పరువు నష్టం దావా

వరంగల్ లీగల్: అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి లక్ష్యంగా తప్పుడు ప్రకటనలు ప్రచురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం.. సమాజంలో తన గౌరవ మర్యాదలకు నష్టం కలిగించిందని మాజీ ఎమ్మెల్యే, వర్దన్నపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు బుధవారం మున్సిఫ్ మెజిస్ట్రేట్‌కోర్టు జడ్జి నసీమ్‌సుల్తానా ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనం తరం సంబంధిత సాక్షుల విచారణ కోసం ఈ కేసును కోర్టు 20కి వాయిదా వేసింది.
 
 

మరిన్ని వార్తలు