శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు

26 Aug, 2019 14:10 IST|Sakshi

బాబు హయాంలోనే శ్రీశైలంలో అన్యులకు ఉద్యోగాలు

ప్రభుత్వానికి నివేదిక అందించిన శ్రీశైలం దేవస్థానం ఈవో

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. శ్రీశైలం ఆలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరు ఎప్పుడు నియమితులయ్యారనే వివరాలతో ఆలయ ఈవో కేఎస్‌ రామారావు.. దేవదాయ శాఖ కమిషనర్‌ పద్మకు శనివారం నివేదికను అందజేశారు. ఆలయంలో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగుల్లో ముగ్గురు, మరో 14 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అన్యమతస్తులేనని తెలుస్తోంది. ఈ 14 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో తొమ్మిది మంది చంద్రబాబు సీఎంగా ఉన్న 1998–2003 మధ్య నియమితులైనవారేనని శ్రీశైలం దేవస్థానం ఈవో నివేదికలో పేర్కొన్నారు. 

మరో ఐదుగురు 2010–11లో ఉద్యోగాలు పొందారని వివరించారు. ముగ్గురు రెగ్యులర్‌ ఉద్యోగుల్లో ఒకరు చంద్రబాబు సీఎంగా ఉన్న 2001లోనూ, మిగిలిన ఇద్దరు 1982, 1993లో నియమితులయ్యారని తెలిపారు. 1993లో చేరిన రెగ్యులర్‌ ఉద్యోగిని దేవదాయ శాఖ తొలగించినప్పటికీ.. అతడు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాడని.. 2014లో చంద్రబాబు సర్కారే తిరిగి అతడిని ఆలయంలో ఉద్యోగిగా నియమించింది.  


 

మరిన్ని వార్తలు