నిల్వలు నిల్‌!

14 Nov, 2019 09:00 IST|Sakshi

జిల్లాలో వేధిస్తున్న నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పత్రాల కొరత 

వెండర్ల వద్ద నిండుకున్న పత్రాలు 

నాసిక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి సరఫరా  కాకపోవటమే కారణం 

ప్రత్యామ్నాయంగా ఫ్రాంకింగ్‌ మెషిన్‌తో స్టాంపు వేస్తున్న అధికారులు 

ఇబ్బందిపడుతున్న వినియోగదారులు 

జిల్లాలో రూ. 50, రూ.100 విలువైన నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్ల కొరత ఏర్పడింది. విజయవాడ సహా అన్ని ప్రధాన రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ సమస్య వేధిస్తోంది. స్టాంప్‌ వెండర్ల వద్ద కూడా నిల్వలు నిండుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా స్థిర, చరాస్థుల లావాదేవీలు చాలా వరకు తగ్గాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ఫ్రాంక్లింగ్‌ మెషిన్‌తో స్టాంపు  వేసి ప్రస్తుత అవసరాలకు వినియోగిస్తున్నారు.

సాక్షి, అమరావతి: రిజి్రస్టేషన్ల శాఖ జిల్లాలోని సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయాలు, లైసెన్స్‌డ్‌ స్టాంపు వెండర్స్‌ ద్వారా దస్తావేజు పత్రాలు విక్రయిస్తుంది. ఈ స్టాంపు పత్రాలపైనే క్రయ, విక్రయ లావాదేవీలను రాసుకుని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజి్రస్టేషన్లు చేయిస్తారు. అనామతుగానూ, బయానాగా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలను సైతం ఈ పత్రాలపై రాసుకుంటుంటారు. ఎక్కువగా రూ.10, రూ. 20, రూ.50, రూ.100 ముఖ విలువతో స్టాంపు పత్రాలు వినియోగిస్తుంటారు. 

నెలకు రూ.35 లక్షల విక్రయాలు 
జిల్లాల్లో 28 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. అన్ని కార్యాలయలతో పాటు లైసెన్స్‌డ్‌ స్టాంప్‌ వెండర్స్‌ కూడా స్టాంపులు విక్రయిస్తారు. నెలకు సరాసరిన జిల్లాలో రూ.35 లక్షల విలువైన స్టాంపు పత్రాలు అమ్ముడవుతుంటాయి. వీటిలో రూ.50, రూ.100ల స్టాంపులు ఎక్కువగా గిరాకీ          ఉంటుంది. 

నాసిక్‌లో ముద్రణ 
స్టాంపు పత్రాలు అధికారిక రాజ ముద్రతో మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ముద్రణాలయంలో ముద్రిస్తారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటికి ఈ ముద్రణా కేంద్రం నుంచే స్టాంపు పేపర్లు సరఫరా అవుతుంటాయి. ఎన్నికల ముందు నుంచి రాష్ట్రానికి సరిపడా స్టాంపు పత్రాలు ఆ కేంద్రం నుంచి రావటం లేదు. దీంతో కొన్ని రోజులుగా స్టాంపు పత్రాల కొరత తీవ్రమైంది. ఫలితంగా లావాదేవీలు నిలిచిపోతున్నాయి. రూ.100 విలువైన స్టాంపు పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నట్లు సమాచారం. రాజధాని నగరం విజయవాడలో కొంత మేరకు రూ.10, రూ.20 విలువైన స్టాంపు పత్రాలు లభిస్తుండగా రూ.50, రూ.100ల స్టాంపు పత్రాలు కొరత వేధిస్తోంది. గన్నవరం, నూజివీడు సబ్‌రిజిస్ట్రార్‌ వంటి గ్రామీణ ప్రాంత కార్యాలయాల్లో కొంతమేర లభిస్తుండటంతో నగర ప్రజలు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.  

ఫ్రాంకింగ్‌ మెషిన్‌... 
ప్రభుత్వం రూ.10, రూ.20, రూ.50, రూ.100 ముఖ విలువతోనే స్టాంపు పత్రాలు విక్రయిస్తోంది. స్టాంపు డ్యూటీ ఎక్కువ మొత్తంలో అంటే ఉదాహరణకు రూ.10వేలు అంతకు మించిన విలువ మేరకు పత్రాలు కొనుగోలు చేయాలంటే స్టాంపు పత్రాలు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా ఫ్రాంకింగ్‌ మెషిన్‌ను వినియోగిస్తున్నారు. ఒక తెల్లకాగితంపై కావాల్సినంత విలువను ముద్రించి ఇస్తారు. ఒక్క కాగితంపైనే ఒప్పందం రాసుకునేవారు ఈ విధానంలో పెద్ద మొత్తానికి తగిన విధంగా ఫ్రాంకింగ్‌ మిషన్‌ వినియోగిస్తారు. ఈ యంత్రాలు రిజి్రస్టార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. కొంతమంది లైసెన్స్‌డ్‌ వెండర్ల దగ్గరా ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రాంకింగ్‌ యంత్రం వినియోగించి ముద్రించిన విలువకు సమానమైన నగదు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టాంపు పేపర్లు అందుబాటులో లేకపోవటంతో వీటిని ఉపయోగిస్తున్నారు.  

లావాదేవీలకు కష్టం... 
లావాదేవీల్లో చట్టపరమైనవే కాక కొన్ని అనధికారికంగా కూడా నడుస్తుంటాయి. అటువంటి వ్యవహారాలు ఫ్రాంకింన్‌ మెషిన్‌తో స్టాంపు విలువ ముద్రించుకోవటం వీలుపడదు. ఇటువంటి వ్యవహారాలకు స్టాంపుల కొరత తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. ఇటువంటి వారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న అరకొర పత్రాలను బ్లాక్‌లో కొందరు బ్రోకర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రూ.100 విలువ చేసే పత్రాలను విజయవాడ గాం«దీనగర్‌ సబరిజి్రస్టార్‌ కార్యాలయ పరిధిలో ఏకంగా రూ.150 నుంచి రూ.180ల దాకా అమ్ముతున్నారని ఓ వినియోగదారుడు వాపోయారు.


కొరత లేకుండా చేస్తున్నాం.. 
కొన్ని ప్రాంతాల్లో స్టాంపుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఆయా చోట్ల యుద్ధ ప్రాతిపాదికన అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే విజయవాడ గాం«దీనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కావాల్సిన స్టాంపులను పంపాం. జిల్లాలో అవసరమున్న చోట్లకు మిగులుగా ఉన్న ప్రాంతాలను నుంచి సర్దుబాటు చేసే కార్యక్రమం జరుగుతోంది. – శ్రీనివాస మూర్తి, డీఐజీ, రిజిస్ట్రేషన్‌ శాఖ, కృష్ణా జిల్లా 

మరిన్ని వార్తలు