దక్కని ధర

29 Oct, 2014 03:35 IST|Sakshi
దక్కని ధర

సుబాబుల్, జామారుుల్  రైతులు విలవిల
 కొనుగోళ్లు చేయని  పేపర్‌మిల్లు యూజమాన్యాలు
తప్పనిసరై బ్రోకర్లకు  అమ్ముకుంటున్న రైతులు
నేడు మానిటరింగ్ కమిటీ సమావేశం

 
సుబాబుల్, జామారుుల్ కొనుగోలులో పేపర్ మిల్లుల యూజమాన్యాలు ఒప్పందాలు పాటించడం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు.
 
ఒంగోలు : జిల్లాలో ఎంతోకొంత లాభసాటిగా ఉన్న సుబాబుల్, జామాయిల్ అమ్మకాలు కూడా బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో రైతులకు అగ్రిమెంట్ ప్రకారం ధర రాక తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల వద్ద నుంచి పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపై ప్రకాశం జిల్లా కలెక్టర్ జూన్‌లో మానిటరింగ్ కమిటీని వేశారు. ఇందులో రైతుసంఘం నేతలతో పాటు మార్కెటింగ్ అధికారులు కూడా ఉన్నారు. రైతుల నుంచి పేపర్ మిల్లులు కొనుగోలు చేయడం లేదనే విషయం ఈ కమిటీ పర్యవేక్షణలో కూడా తేలింది. ఈ నేపథ్యంలో బుధవారం ఒంగోలులో మానిటరింగ్ కమిటీతో పాటు పేపర్ మిల్లుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ విజయకుమార్ సమావేశం ఏర్పాటు చేశారు.

గత ఫిబ్రవరిలో ఒప్పందం...

జిల్లాలోని సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు, దర్శి, కనిగిరి, కందుకూరు, కొండపి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ తోటలు వేశారు. వీటికి సంబంధించి 2014 ఫిబ్రవరి 18న కృష్ణాజిల్లా నందిగామలో సుబాబుల్‌కు టన్నుకు రూ.4,400 చెల్లించే విధంగా రైతులకు, పేపర్ మిల్లుల యాజమాన్యాలకు మధ్య ఒప్పందం కుదిరింది. మన జిల్లాలో ఆ ఒప్పందం అమలు కాకపోవడంతో రైతుసంఘాలు జూన్‌లో కలెక్టర్‌ను కలిసి విన్నవించాయి. దీంతో ఆయన పేపర్‌మిల్లు యాజమాన్యాలను కూర్చోబెట్టి సుబాబుల్‌తో పాటు జామాయిల్‌కు ఒప్పందం కుదిర్చారు. సుబాబుల్‌కు టన్నుకు రూ.4,400, జామాయిల్‌కు రూ.4,600 చెల్లించేలా కుదిరింది.

ఒప్పందం ప్రకారం కొనుగోళ్లు చేయని యూజమాన్యాలు...

జిల్లాలో మార్కెట్ కమిటీలు ఎంపిక చేసిన 30 వేబ్రిడ్జిల వద్ద సరకు అమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు రైతులు సరకును తెస్తే పేపర్‌మిల్లు యాజమాన్యాలు ఎంపిక చేసిన అధీకృత ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. అయితే కంపెనీలు అధీకృత ఏజెంట్లను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో ఒక వందమంది అనధికార ఏజెంట్లను ఏర్పాటు చేశారు. వీరు రైతులు సరకు తీసుకువస్తే కొనడం లేదు. దీంతో రైతులు అనివార్యంగా బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. గతంలో దీనిపై సంతనూతలపాడు వద్ద రైతుసంఘాలు అనేక సార్లు రాస్తారోకోలు చేశాయి. ఆందోళన చేసిన సమయంలో మొక్కుబడిగా కొనుగోలు చేసినా తర్వాత కొనడం లేదు. దీనిపై మానిటరింగ్ కమిటీ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. జిల్లాలో గత మూడు నెలల కాలంలో రైతుల వద్ద నుంచి సుమారు 25 వేల టన్నుల జామాయిల్, సుబాబుల్ అమ్మకాలు జరిగాయి. రైతులకు ఒప్పందం ప్రకారం ధర చెల్లించాల్సి ఉండగా, టన్ను సుబాబుల్‌కు రూ.3,700, జామారుుల్‌కు రూ.3,500 మాత్రమే చెల్లించారు. దీంతో రైతులు టన్ను సుబాబుల్‌కు రూ.500, జామాయిల్‌కు రూ.1,100 చొప్పున నష్టపోతున్నారు.

మరో 30 వేల ఎకరాల్లో కటింగ్...

వచ్చే మూడు నెలల్లో సుమారు 30 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కటింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పేపర్ మిల్లుల నుంచి సరైన ధర ఇప్పించని పక్షంలో రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. పేపర్ రేట్లు భారీగా పెరుగుతున్నా సుబాబుల్, జామాయిల్ ధర మాత్రం పెరగడం లేదు. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికైనా తమకు న్యాయమైన ధర అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు