గ్రామ సచివాలయాల్లో 14,061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

11 Jan, 2020 06:32 IST|Sakshi

దరఖాస్తులకు గడువు 31 

రాత పరీక్ష మార్చి నెల తర్వాత నిర్వహించే అవకాశం   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు. దరఖాస్తులు చేసుకోవాల్సిన వెబ్‌సైట్లు: gramasachivalayam.ap.gov.in,vsws.ap.gov.in,wardsachivalayam.ap.gov.in 

వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు
రాష్ట్రంలో పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్‌ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ చెప్పారు. దరఖాస్తుకు వెబ్‌సైట్లు:  wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in

మరిన్ని వార్తలు