12 బీపీఎం పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

21 Dec, 2013 02:10 IST|Sakshi

 ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒంగోలు పోస్టల్ డివిజన్ పరిధిలో గ్రామీణ డాక్ సేవక్ పథకం కింద ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ల (బీపీఎం) వివరాలను ఆ శాఖ శుక్రవారం ప్రకటించింది. పోస్టల్ డివిజన్ పరిధిలో 12 బ్రాంచ్ పోస్టుమాస్టర్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను ఒంగోలు డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్‌ఆఫీస్ (ఎస్‌ఎస్‌పీ) విజయ్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 12 పోస్టుల్లో జనరల్ విభాగం నుంచి ఆరుగురిని, ఓబీసీ నుంచి నలుగురిని, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసేందుకు విధి విధానాలు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు 2014 జనవరి 16 ఆఖరు తేదీగా గడువు విధించారు.

 డివిజన్‌లోని బొట్లగూడూరు సబ్ పోస్టాఫీసు పరిధిలోని తూమాటివారిపాలెం బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఖాళీని జనరల్‌కు కేటాయించారు. దీంతో పాటు జనరల్ కేటగిరీకి కేటాయించినవి పందిళ్లపల్లి సబ్ పోస్టాఫీసు (ఎస్‌వో) పరిధిలోని మోటుపల్లి, వెలిగండ్ల ఎస్‌వో పరిధిలోని రాళ్లపల్లి, కొండపి పరిధిలోని తాటాకులపాలెం, జువ్విగుంట, నాగులుప్పలపాడు పరిధిలోని పోతవరం ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో రామాయపట్నం పరిధిలోని రావూరు, స్వర్ణ పరిధిలోని కేశవరప్పాడు, టంగుటూరు పరిధిలోని అనంతవరం, పెరిదేపి పరిధిలోని వేములపాడు ఉన్నాయి. కురిచేడు పరిధిలోని బండి వెలిగండ్ల ఎస్సీ కేటగిరీకి, తాళ్లూరు పరిధిలోని రాజానగరం ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జనవరి 20 నుంచి 27వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. తూమాటివారిపాలేనికి జనవరి 20న ఉదయం 10 గంటలకు, రావూరుకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు.

మోటుపల్లికి 21 ఉదయం 10 గంటలకు, అదే రోజు 2 గంటలకు కేశరప్పాడుకు బీపీఎంలను ఎంపిక చేస్తారు. రాళ్లపల్లికి 22న ఉదయం 10 గంటలకు, బండివెలిగండ్లకు అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు బీపీఎంలను ఎంపిక చేస్తారు. తాటాకులపాలేనికి 23న ఉదయం 10 గంటలకు, అనంతవరానికి మధ్యాహ్నం 2 గంటలకు, 24న ఉదయం 10 గంటలకు జువ్విగుంటకు, మధ్యాహ్నం 2 గంటలకు రాజానగరానికి, 27న ఉదయం 10 గంటలకు పోతవరానికి, మధ్యాహ్నం 2 గంటలకు వేములపాడుకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్‌ల ద్వారానే పంపాలి. దరఖాస్తులు ఓ.విజయకుమార్, సీనియర్ సూపరింటెండెంట్, పోస్టాఫీసు, ప్రకాశం డివిజన్, ఒంగోలు 523001కు పంపాలి.

ఎంపిక ప్రక్రియ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసు, ప్రకాశం డివిజన్, భాగ్యనగర్, ఆర్టీవో కార్యాలయంపై, ఒంగోలులో నిర్వహిస్తారు. దరఖాస్తు పంపే కవరుపై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడీఎస్, బీపీఎం అని రాయాలి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకుంటున్న ప్రదేశం పేరు, అది ఏ సబ్ పోస్టాఫీసు పరిధిలోకి వస్తుందో కూడా కవరుపై పేర్కొనాలి. మరిన్ని వివరాలకు ఒంగోలు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని లేదా సమీపంలోని సబ్ పోస్టాఫీసును సంప్రదించాలని విజయకుమార్ వివరించారు.

మరిన్ని వార్తలు