పాస్‌పోర్టు మరింత ఈజీ

14 Aug, 2014 00:38 IST|Sakshi
పాస్‌పోర్టు మరింత ఈజీ
  • చిరునామా ధ్రువపత్రంగా ఇకపై రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వొచ్చు
  • గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్ అక్కర్లేదు
  • పాస్‌పోర్టుల జారీలో విదేశాంగ శాఖ కొత్త నిర్ణయాలు
  • హైదరాబాద్, విశాఖపట్నం కార్యాలయాలకు ఆదేశాలు
  •  
     సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం లేదా ఉద్యోగ నిర్వహణ కోసం కొత్తగా పట్టణాలకు వచ్చిన వారిలో చాలామందికి చిరునామాకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉండవు. అలాంటి వారు పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటివరకూ చాలా ఇబ్బంది పడేవారు. కానీ పాస్‌పోర్ట్ సేవల సరళతరంలో భాగంగా రెంటల్ అగ్రిమెంట్ (అద్దె ఒప్పంద) పత్రాలను కూడా చిరునామా ధ్రువపత్రాలుగా స్వీకరించాలని విదేశాంగ శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాలకు సమాచారమిచ్చినట్టు హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
     
     కనీసం ఏడాది నుంచి అద్దెకుండాలి
     ప్రస్తుతం ఓటర్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ల్యాండ్‌లైన్ టెలిఫోన్ బిల్లు, ఫొటోతో కూడిన బ్యాంక్ స్టేట్‌మెంట్ (నివేదిక) తదితరాలను చిరునామా ధ్రువపత్రాలుగా స్వీకరిస్తున్నారు. వాటి సరసన ఇకపై రెంటల్ అగ్రిమెంట్‌నూ స్వీకరిస్తారు. ఏ ఇంట్లో అయితే అద్దెకుంటున్నారో అక్కడ కనీసం ఏడాది నుంచి ఉన్నట్టు ఆ ఇంటి యజమానితో ‘1908 రిజిస్ట్రేషన్ యాక్ట్’ సెక్షన్ 17 ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలో ఈ ధృవపత్రాన్ని చిరునామా నకలుగా పరిగణిస్తారు. తత్కాల్ దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రెంటల్ అగ్రిమెంట్ చిరునామా నకలుగా పనిచేస్తుంది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని పాస్‌పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి.
     
    •  గెజిటెడ్ అటెస్టేషన్లకు చెల్లుచీటీ
    •  ఇకపై ధ్రువపత్రాల నకలు(జిరాక్స్) కాపీలపై గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ(అటెస్టేషన్) అవసరం లేదని విదేశాంగ శాఖ నిర్ణయించింది. వీటిలో కొన్ని ముఖ్యమైనవి పరిశీలిస్తే...
    •  - బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్లు తదితర జిరాక్స్‌లపై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. సెల్ఫ్ అటెస్టేషన్(అభ్యర్థి సంతకం) చేస్తే సరిపోతుంది.
    •   వివాహ ధ్రువపత్రంపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్(పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థి) సంతకం చాలు
    •   పాస్‌పోర్ట్ దరఖాస్తుకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్ అధికారుల పరిశీలనకు అన్ని ఒరిజనల్ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి. కానీ పాస్‌పోర్ట్ కార్యాలయానికి కేవలం సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
    •   ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ పదవీ విరమణ పొందినా, లేదా పదవికి రాజీనామా చేసినా దీనికి సంబంధించి పెన్షన్ చెల్లింపుల ధ్రువపత్రాలుగానీ, పదవీ విరమణ చేసినట్టు ప్రభుత్వాధికారి ధ్రువీకరించిన పత్రాలుగానీ సమర్పిస్తే సరిపోతుంది.
    •   గతంలో ఉన్నట్టుగానే ఏ, సీ, డీ, ఈ, జీ, ఐ, కే, ఎల్ అఫిడవిట్‌లు కేవలం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇస్తున్నారు. ఇకపై కూడా ఏ నుంచి ఎం వరకూ అన్ని అఫిడవిట్(అనెక్సెర్)లూ స్వీకరించాలని ఎంఈఏ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్ట్‌టర్నల్ ఎఫైర్స్) ఆదేశాలు ఇచ్చింది.
>
మరిన్ని వార్తలు