ఆస్తి ఇవ్వకపోతే అంతం చేస్తామంటున్నారు..

30 Apr, 2018 03:21 IST|Sakshi
వైఎస్‌ జగన్‌కు సమస్య వివరిస్తున్న శివలీల

ఎంపీ కొనకళ్ల బంధువుల నుంచి నా కుమారుడి కుటుంబానికి ప్రాణహాని

వైఎస్‌ జగన్‌ ఎదుట కన్నీటిపర్యంతమైన బసవతారకం బంధువులు

సాక్షి, అమరావతిబ్యూరో/ గాంధీనగర్‌: ‘మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఆయన బంధువు పామర్తి అనిల్‌కుమార్‌ నుంచి నా కుమారుడు రాంకుమార్‌ కుటుంబానికి ప్రాణహాని ఉంది. నా భర్త పేరుతో ఉన్న 9 ఎకరాలు, పెద్ద కుమారుడి పేరుతో ఉన్న 22 ఎకరాలను తక్కువ ధరకు అమ్మాలన్న వారి ఒత్తిడికి మేం తలొంచకపోవడంతో ఐదు రోజుల కిందట పోలీసులు నా కుమారుడు, కోడలు రజనీతో పాటు ఇద్దరు మనవళ్లనూ తీసుకెళ్లారు.. మాకు మీరే దిక్కు’ అంటూ ఎన్టీఆర్‌ మొదటి భార్య బసవతారకం సమీప బంధువు అయిన కాట్రగడ్డ శివలీల ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు.

‘నేను పోలీస్‌స్టేషన్‌కెళ్లగా అనిల్‌కుమార్‌కు నా కుమారుడు బాకీ ఉన్నాడని, ఆ బాకీ తీర్చి వారిని తీసుకెళ్లండని పోలీసులు ఒత్తిడి చేసి.. మా వద్ద నుంచి రూ.50 లక్షలకు, రూ.25 లక్షలకు వేర్వేరుగా చెక్కులు తీసుకోవడంతో పాటు ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించుకుని కూడా వారిని విడిచి పెట్టలేదు.. దీనిపై ఎస్పీకి మొరపెట్టుకుంటే.. వివాదాన్ని పరిష్కరించుకోకుంటే రాంకుమార్‌ ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె కష్టాన్ని చూసి చలించిపోయిన జననేత.. ఆమె విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు.  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు శివలీల ఫిర్యాదు విషయం సాక్షి టీవీలో ప్రసారమవడంతో రాంకుమార్‌ కుటుంబ సభ్యులను పోలీసులు విడిచిపెట్టారు.

మరిన్ని వార్తలు