లేడీస్‌ హాస్టల్లో యువకుడు.. ఆరుగురి సస్పెన్షన్‌!

22 Feb, 2020 16:00 IST|Sakshi

సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం రేగింది. అక్కడి సెక్యురిటీ లోపాలు మరోసారి బయటపడ్డాయి. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు.. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలోని లేడీస్‌ హాస్టల్లోకి ఓ యవకుడు చొరబడ్డాడు. కొందరు విద్యార్థినుల సహకారంతో కిటీకీ ఊచలు విరగొట్టి హాస్టల్లోని ఓ గదికి చేరాడు. రోజంతా అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం విద్యార్థినులంతా గదికి తాళం వేసి యథావిధిగా కాలేజీకి వెళ్లారు.

అయితే, ఆ గదిలో మనుషుల అలికిడి గ్రహించిన తోటి విద్యార్థులు విషయాన్ని సెక్యురిటీ సిబ్బందికి తెలిపారు. దాంతో వారు తాళం పగులగొట్టి గదిలో నక్కిన యువకుడిని పట్టుకున్నారు. విషయం ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. కొందరు విద్యార్థినుల సహకారంతో అతను లోపలికి వెళ్లగలిగాడని తేలింది. యువకుడికి సహకరించిన ఆరుగురు విద్యార్థినులను యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది. పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి కావడం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సెక్యురిటీ సిబ్బందిపై విచారణ నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు