ఆంక్షలులేని తెలంగాణకు డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఆదివారం మహత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ వద్ద మౌన దీక్ష చేశారు. సంపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్నే ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి బిల్లునే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదం పొందేలా అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు సహకరించాలని కోరారు. నేతలు పిడమర్తి రవి, పున్నా కైలాశ్, రమేశ్ ముదిరాజ్, జగన్ సహా సుమారు 30 మంది విద్యార్థులు గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి దీక్షకు దిగారు. 2 గంటల దీక్ష అనంతరం మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను ఎవరూ అడ్డుకోరాదన్నారు. భద్రాచలం డివిజన్లోని గ్రామాలను సైతం సీమాంధ్రలో కలపరాదని కోరారు. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్కు అప్పగించడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు.