అటు ఎన్నికల విధులు..ఇటు గ్రూప్‌–1 గుబులు!

18 May, 2019 03:32 IST|Sakshi

26న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహణపై అధికారుల ఆందోళన

ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్న వేళ పరీక్ష నిర్వహణపై అయోమయం  

23న సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ 

వీవీప్యాట్‌లు లెక్కించాల్సి రావడంతో 24వ తేదీకిగానీ పూర్తిగాని ప్రక్రియ 

ఆ తర్వాత కూడా ఎన్నికల గణాంకాల రూపకల్పనలో అధికారులు

సాక్షి, అమరావతి: ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహిస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలలుగా సాధారణ ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నామని, కనీసం ఊపిరిపీల్చుకునే సమయం కూడా లేకుండా ఏపీపీఎస్సీ పరీక్షల విధులు ఎలా నిర్వహించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రూప్‌–1 కేటగిరీలోని 169 పోస్టుల భర్తీకి తలపెట్టిన ప్రిలిమ్స్‌ పరీక్ష 26న జరగనుంది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేపట్టింది. 254 పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్లో జరిగే ఈ పరీక్షకు 1.14 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 17వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు జారీచేస్తోంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలకపాత్ర పోషించే రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండే సమయంలో ఈ పరీక్షలను నిర్వహిస్తుండటంపై విమర్శలొస్తున్నాయి. పైగా ఈ పరీక్షలకు పోటీపడుతున్న వారిలో అనేకమంది ప్రస్తుతం వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న వారున్నారు. ప్రస్తుతం వారంతా ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో పరీక్షలుండటంతో వారంతా అయోమయానికి గురవుతున్నారు.
 
నిర్ణీత సమయం ఇవ్వకుండా.. 
గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ తర్వాత కనీసం 150 రోజుల వ్యవధి ఇచ్చి ప్రిలిమ్స్‌ పెట్టాలి. కానీ ఏపీపీఎస్సీ కేవలం 69 రోజుల వ్యవధి ఇచ్చి మార్చి 10వ తేదీన పరీక్షలంటూ ప్రకటన ఇచ్చింది. దీనిపై అభ్యర్థులు ఆందోళనలకు దిగడంతో మార్చి 31కి మార్పు చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటం, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో షెడ్యూల్‌ను మే 26కి వాయిదా వేసింది. ఈ నెల 23న సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఈసారి వీవీప్యాట్‌లను కూడా లెక్కించాల్సి ఉండటంతో 24వ తేదీకి గానీ కౌంటింగ్‌ పూర్తికాదు. ఆ తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు సమగ్రంగా రూపొందించే పనిలో ఉన్నతాధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉంటారు.

ఈ తరుణంలో ఆ మర్నాడే గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉండటంతో రెవెన్యూ యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే ఈ గ్రూప్‌–1 పరీక్షలకు సంబంధించి తొలి నుంచీ ఏదో ఒక వివాదం ఏర్పడుతూనే ఉంది. రెండుసార్లు షెడ్యూల్‌ మార్పుచేయాల్సి రావడం, పోస్టుల కుదింపు, ఏడాదిలోనే సిలబస్‌ మార్పు, పరీక్షల విధానంలోనూ కొత్తగా మార్పులు.. తదితర అంశాలు ఈ పరీక్షల కోసం పోటీపడుతున్న లక్షలాది నిరుద్యోగులను ఇబ్బందులుపెట్టాయి.

పోస్టులు కుదించి నోటిఫికేషన్‌.. ఏడాదిలోనే సిలబస్‌ మార్పు 
గ్రూప్‌–1 పోస్టుల ఖాళీలున్నా ప్రభుత్వం వాటన్నింటినీ భర్తీచేయడం లేదు. రాష్ట్ర విభజన నాటికి గ్రూప్‌–1 పోస్టులు 245 ఉండగా రిటైరైన వారి పోస్టులను కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇంతకు ముందు కేవలం 78 పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చారు. తర్వాత 182 పోస్టులు భర్తీచేస్తామని జీవో ఇచ్చి నోటిఫికేషన్లో 169 పోస్టులనే చూపారు. అలాగే 2016లో ప్రకటించిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ సమయంలో ఏపీపీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేసింది. దీంతో అప్పటివరకు ఉన్న సిలబస్‌తో కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. 2018 చివర్లో ప్రస్తుత గ్రూప్‌–1కు నోటిఫికేషన్‌ ఇచ్చే కొద్దిరోజుల ముందు ఏపీపీఎస్సీ మళ్లీ సిలబస్‌ మార్పుచేసి ముసాయిదాను, తుది సిలబస్‌ను ప్రకటించి.. మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏడాదిలోపలే గ్రూప్‌–1 వంటి కీలక పరీక్ష సిలబస్‌ను హఠాత్తుగా మార్పు చేయడంపై విమర్శలొచ్చాయి. ముఖ్యంగా రెండు కోచింగ్‌ సెంటర్లకు సంబంధించిన ముఖ్యులు ఏపీపీఎస్సీలో చక్రం తిప్పుతున్నందునే ఇలా జరుగుతోందని ప్రచారం 

ఏడాది తిరక్కుండానే ఎన్నో మార్పులు
గతంలో గ్రూప్‌–1లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లో 150 మార్కులకు ఉండగా.. ఈసారి పేపర్‌–1, పేపర్‌–2గా విభజించి 120 మార్కుల చొప్పున 240 మార్కులకు పెంచేశారు. గతంలో క్వాలిఫైయింగ్‌ పేపర్‌ కింద జనరల్‌ ఇంగ్లీష్‌ సబ్జెక్టు ఒక్కటే ఉండగా.. ఇప్పుడు తెలుగును కూడా చేర్చారు. ప్రిలిమ్స్‌ పేపర్‌–1 గతంలో జనరల్‌ ఎస్సే మాత్రమే ఉండగా.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి అంశాలుంటాయని సిలబస్‌లో పొందుపరిచారు. పేపర్‌–2, పేపర్‌–3, పేపర్‌–4, పేపర్‌–5లలో గతంలో ఉన్న అంశాలను తీసేసి కొత్త వాటిని చేర్చడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. వీటిపై ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.  జరిగింది. 

మరిన్ని వార్తలు