గ్రీవెన్స్‌సెల్‌కు హాజరుకాని అధికారులు

7 Jan, 2014 04:16 IST|Sakshi

 సాక్షి, కడప : జిల్లా వ్యాప్తంగా వేళకు విధులకు రావాల్సిన అధికారులు ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్నారు. వచ్చినా గ్రీవెన్స్ సెల్‌కు హాజరు కావడం లేదు. దీంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ‘గ్రీవెన్స్‌సెల్’కు మండలాధికారులు ఏమాత్రం ప్రాధన్యత ఇవ్వడంలేదు.
 సోమవారం...
 గ్రీవెన్స్ డే: ప్రతి  సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో  కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తారు. ఇదే క్రమంలో ప్రతి మండల కేంద్రంలో కూడా సోమవారం గ్రీవెన్స్‌సెల్ కచ్చితంగా నిర్వహించాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. సోమవారాన్ని ‘గ్రీవెన్స్‌డే’గా అధికారులు నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో మినహా తక్కిన చాలా మండల కేంద్రాల్లో గ్రీవెన్స్‌డేలు నిర్వహించడం లేదు.

 ఎక్కడికి వెళ్లాలో... ఎన్ని సార్లు వెళ్లాలో..
 గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజలు గ్రీవెన్స్ సెల్‌కు వస్తారు. అన్నిశాఖల అధికారులు ఆరోజు ఒకేచోట అందుబాటులో ఉంటారని, తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశతో వెళతారు. తీరా మండలానికి పోయిన తర్వాత వేళకు కొంతమంది అధికారులు రారు. గ్రీవెన్స్‌సెల్‌కు పూర్తి గైర్హాజరవుతారు? దీంతో తమ సమస్య పరిష్కారం కోసం ఓశాఖ కార్యాలయానికి ఒకసారి, తర్వాత మరో అధికారి వద్దకు...ఆపై ఇంకో అధికారి వద్దకు ప్రజలు తిరగాల్సి వస్తోంది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్‌సెల్‌కు వెళితే అక్కడ మండలాధికారులకు సమస్యను ఎండార్స్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే అసలు అధికారులే అందుబాటులో లేని పరిస్థితి. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో...ఎన్నిసార్లు వెళ్లాలో అర్థం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 అందరూ హాజరు కావల్సిందే: ఈశ్వరయ్య, డీఆర్‌ఓ.
 గ్రీవెన్స్‌సెల్‌కు తహశీల్దార్‌తో పాటు అన్నిశాఖల అధికారులు కచ్చితంగా హాజరుకావాల్సిందే!  ఈ మేరకు కలెక్టర్  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారానికి అందరూ ఒకేచోట ఉండాలని గ్రీవెన్స్‌డేను పెట్టాం. ఇకమీదట హాజరుకాని వారిపై తక్షణ చర్యలు ఉంటాయి.

మరిన్ని వార్తలు