టీడీపీ కార్యాలయానికి నోటీసులు

13 Oct, 2019 11:46 IST|Sakshi
అదికారులు జారీ చేసిన నోటీసు,అక్రమంగా నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయ భవనం

పోరంబోకు భూమిలో టీడీపీ కార్యాలయ నిర్మాణం

ఏడు రోజుల్లో ఆక్రమణలు  తొలగించాలని ఆదేశం

సాక్షి కథనంతో స్పందించిన అధికారులు

సాక్షి, మంగళగిరి(గుంటూరు) : ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి, ప్రైవేటు రైతుల భూములను ఆక్రమించి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారి వెంట టీడీపీ కార్యాలయ భవనం నిర్మిస్తుంది. దీనిపై ఈ నెల 3వ తేదీన ‘అక్రమంగా టీడీపీ కార్యాలయ నిర్మాణం’ అనే శిర్షీకతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కి వాగు పోరంబోకు స్థలాన్ని పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు కేటాయించారు. మూడు ఎకరాల 65 సెంట్లు ప్రభుత్వం కేటాయించగా, నిర్మాణం చేపట్టిన నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 392/2 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం చేపట్టారు.

ఈ విషయాలను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. ప్రభుత్వ వాగు పోరంబోకు భూమిని పరిశీలించారు. ఆక్రమించి నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు. గత శుక్రవారం నిర్మాణదారులకు ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు