తెట్టులోనే ఉంది గుట్టు?

14 Sep, 2014 01:37 IST|Sakshi
తెట్టులోనే ఉంది గుట్టు?

ఆయిల్‌ఫెడ్‌లో రూ.450 కోట్ల కుంభకోణం..!
అశ్వారావుపేట ఆయిల్‌ఫాం {Mషింగ్ ఫ్యాక్టరీ కేంద్రంగా పామాయిల్ చమురు దోపిడీ
భారీ ముడి చమురున్న తెట్టును పీపాల్లో అక్రమంగా తరలిస్తున్న వైనం
ఇదే ఫ్యాక్టరీ రిక వరీనే ప్రామాణికంగా తీసుకొని ధర నిర్ణయిస్తున్న ప్రైవేట్ కంపెనీలు
రైతుల్లో ఆందోళన.. అక్రమాలు నిజమేనన్న ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్ణు

 
 హైదరాబాద్: పామాయిల్ పరిశ్రమలో తెట్టు మాటున చేస్తున్న ముడిచమురు అక్రమ రవాణా గుట్టుర ట్టు అయింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌ఫాం క్ర షింగ్ ఫ్యాక్టరీలో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. ఈ క్రషింగ్ ఫ్యాక్టరీ ప్రారంభమైన ఏడేళ్ల నుంచి జరుగుతోన్న ఈ తంతుతో పామాయిల్ రైతులను ఆర్థికంగా పీల్చి పిప్పిచేశారు. ఫ్యాక్టరీ అధికారులు మొదలుకొని ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు ఉన్నతాధికారులు.. ప్రైవేట్ కంపెనీ దళారులతో కుమ్మ క్కై ఈ భారీ కుంభకోణానికి ఒడిగట్టారు. రెండురోజుల క్రితం అక్రమంగా తరలిస్తున్న ముడిచమురున్న తెట్టును రైతులు పట్టుకోవడంతో ఈ బండారం బట్టబయలైంది. దీనిపై విచారణ జరుగుతోంది. అక్రమాలు నిజమేనని సాక్షాత్తూ ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్ణు అనడంతో ఎంత కుంభకోణం జరిగిందనే చ ర్చ జరుగుతోంది.

దోపిడీ జరుగుతోందిలా...!

గెలలు క్రషింగ్ అయిన తర్వాత వ్యర్థాలను (మడ్డి) వదిలేందుకు అశ్వారావుపేటలో 3 చెరువులను తవ్వారు. రోజూ వీటిని అందులోకి పంపుతారు. నిజానికి వీటిలో 2.3 శాతానికి మించి ముడిచమురు ఉండకూడదు. కానీ అధికారులు ఒకరోజు అకస్మాత్తుగా వెళ్లి చూస్తే క్రషింగ్ అనంతర వ్యర్థాల్లో ఏకంగా 73 శాతం ముడి చమురు ఉన్నట్లు తేలింది. ఒకసారి రైతులు చేయించిన పరీక్షలో ఏకంగా 98 శాతం నూనె ఉన్నట్లు తేలింది. విచారణాధికారుల కమిటీ ముందే ఈ విషయం బట్టబయలైంది. ఈ మడ్డిపై చెరువులో తెట్టు తేలి ఉంటుంది. దాన్ని తీసుకువెళ్లేందుకు కొందరు కాంట్రాక్టర్లు వస్తారు. ఆ తెట్టును అతి తక్కువ ధర కే అమ్ముతారు. అయితే కేవలం తెట్టునే కాకుండా ముడిచమురు కలిసి ఉండేలా ఈ వ్యర్థాలను కూడా పీపాల్లో పోసుకొని దానిపైన తెట్టు వేస్తారు. చూసేవారికి కేవలం తెట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇలా పెద్దఎత్తున ముడిచమురు తరలివెళుతోంది. ఆ ముడి చమురును ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకొని వారు కోట్లు గడిస్తుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెట్టును తీసుకెళ్లే లారీలు వచ్చిన రోజునే ఈ మడ్డిలో ముడిచమురును పెద్దఎత్తున కలిపేస్తారు. మిగిలిన రోజుల్లో కలపడానికి అవకాశం ఉండదు. అలా కలిపితే చెరువులు ఓవర్‌లోడ్ అవుతాయి. నెలకు ఐదారుసార్లు ఇలా చేస్తున్నారు. తెట్టును బస్తా సంచుల్లో తీసుకెళ్లవచ్చు. కానీ పీపాల్లో తరలిస్తుండటం గమనార్హం. ఆయిల్‌ను ఉత్పత్తి చేసే సమయంలో వృథాగా బైటకు వెళ్లే తెట్టు బాగా అట్టకట్టుకొని ఉంటుందని.. దాన్ని బస్తా సంచుల్లో ఎత్తి పంపేయవచ్చని అంటున్నారు. పీపాల్లోనూ.. ట్యాంకర్లలోనూ తెట్టును నింపాల్సిన అవసరం ఉండనే ఉండదంటున్నారు. అంటే ముడిచమురుతో నిండిన తెట్టును అక్రమంగా తరలిస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలా నెలకు రూ. 5 కోట్లకుపైగా కొల్లగొడుతున్నారని అంచనా.

ఇంకో మార్గంలో దోపిడీ..

రైతులకు నెలకోసారి వారి గెలలకు ఎంత రికవరీ (ముడిచమురు) వచ్చిందో దాని ప్రకారం పేమెంట్ చేస్తారు. సహజంగా ఇక్కడ 24 శాతం రికవరీ ఉండాలి. కాని వ్యర్థపు నీటిలో ముడిచమురును తరలించడం వల్ల గెలల ద్వారా వచ్చే ముడిచమురు రికవరీని కేవలం 18 శాతానికి మించనీయకుండా అధికారులు చూస్తారు. ఆ ప్రకారం రైతులకు ఐదారు శాతం రికవరీ తగ్గుతుండటంతో పెద్దఎత్తున నష్టపోతున్నారు. ఇంకో గమ్మత్తై విషయం ఏమింటంటే అశ్వారావుపేట క్రషింగ్ ఫ్యాక్టరీ రికవరీ రేటునే ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన 13 (అందులో ఒకటి ప్రభుత్వ సంస్థ) ప్రైవేటు కంపెనీలు రికవరీ ధర నిర్ణయిస్తాయి. దీని రికవరీ ప్రభావం రెండు రాష్ట్రాల్లోని రైతులపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు దేశంలో ఉన్న మిగిలిన ప్రైవేటు కంపెనీలు కూడా దీన్నే అనుసరిస్తాయని అంటున్నారు. ఎందుకంటే దేశంలో అధికంగా మన ఉమ్మడి రాష్ట్రాల్లోనే పామాయిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అశ్వారావుపేటలో ఉన్న ఆయిల్‌ఫెడ్ వారి క్రషింగ్ ఫ్యాక్టరీ రికవరీ రేటునే ప్రామాణికంగా గుర్తిస్తారు. అంటే అన్నిచోట్ల కూడా రైతులకు ఐదారు శాతం రికవరీ రేటును తగ్గించి ధర ఇవ్వడంతో రైతులు వందల కోట్లు నష్టపోతున్నారు. ఇలా మొత్తంగా అన్ని ప్రాంతా ల రైతులను దోపిడీ చేస్తున్నారు. తద్వారా దాదాపు ఈ నాలుగైదేళ్లలో దాదాపు రూ. 450 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు సంబంధిత ఉన్నతాధికారే ఒకరు చెప్పడం గమనార్హం. అంతేగాకుండా దీని రికవరీ రేటును మరింత తగ్గించి చూపించి నష్టాలబాట పట్టేట్లు చేస్తే ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయవచ్చనేది మరో కుట్రగా చెబుతున్నారు. ముడిచమురు దోచుకెళ్లడం.. రికవరీ రేటును తగ్గించి చూపడం.. నష్టాలబాట పట్టించడం అన్న కోణంలో ఇక్కడ కుట్ర జరుగుతోంది. దీనికి ఆయిల్‌ఫెడ్‌కు చెందిన కొందరు అధికారులు కూడా కుమ్మక్కయినట్లు ఓ అధికారే వెల్లడించారు.

రైతులు మొత్తుకున్నా పట్టించుకోని వైనం...

పామాయిల్ తోటలు సాగు చేసే రైతులు క్రషింగ్ కు వచ్చినప్పుడు తమకు ఎకరానికి రావాల్సిన ఆదాయం రాకపోవడంపై అనేకసార్లు తమ గోడును వెళ్లగక్కారు. విదేశాల్లో ఎక్కువ ఆయిల్ వస్తున్నప్పుడు ఇక్కడ తక్కువ రావడానికి కారణమేంటని ప్రశ్నిస్తే... ఇక్కడి నేలల్లో పండే పామాయిల్‌తో అంతస్థాయిలో ఆయిల్ రాదని చెప్పేవారు. దీంతో వారు తీవ్రమైన నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. పెపైచ్చు వందల కోట్ల రూపాయలు ఆర్జించాల్సిన ఆయిల్‌ఫెడ్ ఆదాయం గణనీయంగా తగ్గింది. అయినా ఇటువంటి దారుణమైన కుంభకోణం జరగడం దారుణమని రైతులు అంటున్నారు.

కోట్లల్లో వ్యాపారం...

ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆయిల్‌ఫాం గెలల నుంచి పామాయిల్ తీస్తారు. అందుకోసం తెలంగాణలో అశ్వారావుపేటలో ఆయిల్‌ఫాం గెలల క్రషింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ ఫ్యాక్టరీ ఉంది. దీంతోపాటు ఆ రాష్ట్రంలో మరో 12 ప్రైవేటు క్రషింగ్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక హెక్టారు పామాయిల్ తోటలకు రూ. 30 వేల మేర సబ్సిడీ ఇస్తుంది. ఒక్కో ఎకరానికి 12 టన్నుల ఆయిల్‌ఫాం గెలలు వస్తాయి. వాటిని క్రషింగ్ చేస్తే 30 శాతం ఆయిల్ వస్తుంది. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో గంటకు 20 టన్నులు క్రష్ చేస్తారు. తద్వా రా 6 టన్నుల ఆయిల్ వస్తుంది. అలా రోజుకు 20 గంటలపాటు 400 టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్ చేస్తే 120 టన్నుల ముడిచమురు వస్తుంది. టన్ను ముడిచమురు ఆయిల్ మార్కెట్లో రూ. 40 వేలకుపైగా ధర పలుకుతుం ది. అంటే రోజుకు రూ. 48 లక్షల విలువైన ఆయి ల్ అశ్వారావుపేటలో క్రషింగ్ అవుతోందన్నమా ట. ఇంత భారీగా ఆయిల్ వస్తుండటంతో దాన్ని కొల్లగొట్టేందుకు భారీ ఫ్లాన్ వేశారు. పారిశ్రామి క నేపథ్యం ఉన్న రాజకీయ ప్రముఖులు, ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఇందులో కీలకంగా ఉన్నారు. దాన్ని నష్టాల బాటన తీసుకొచ్చి కాజేసే కుట్ర జరుగుతోంది.

 ఔను.. అక్రమాలు జరిగాయి: వీఎన్.విష్ణు, ఆయిల్‌ఫెడ్ ఎండీ

అశ్వారావుపేట పామాయిల్ గెలల క్రషింగ్ ఫ్యాక్టరీలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే తెట్టును బస్తాల్లో కాకుండా పీపాల్లో తీసుకెళ్లారు. ఫ్యాక్టరీ స్థాయిలోనే ఈ అక్రమాలకు తెరలేచింది. దీనిపై విచారణకు ఆదేశించాను. ఏమేర అక్రమాలు జరిగాయో విచారణ నివేదిక వచ్చాక తెలుస్తుంది.
 
 

మరిన్ని వార్తలు