గిరిజన జిల్లాకు ఓకే

31 Jul, 2014 01:34 IST|Sakshi
గిరిజన జిల్లాకు ఓకే

జంగారెడ్డిగూడెం :పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్‌కు ఆమో దం లభించడంతో ఖమ్మం జిల్లానుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా కలిసిన ముంపు మండలాలతో కలిపి గిరిజన ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడానికి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపారు. అయితే, పోలవరం కేంద్రంగా గిరి జన జిల్లాను ఏర్పాటు చేయూలని కోరారు. ప్రత్యేక గిరిజన జిల్లా అంశంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం అభిప్రాయ సేకరణ జరి పారు. జంగారెడ్డిగూడెంలోని గంగాభవాని కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు హాజరయ్యూరు.
 
 కలెక్టర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలతోపాటు, ఉభయగోదావరి జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలను కలిపి 20 మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేం దుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించిందన్నారు. తొలిదశలో అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, తదుపరి పీసా చట్టం ప్రకారం గ్రామ గ్రామాన సభలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లా కేంద్రం ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు.
 
 ఆర్డినెన్స్ ద్వారా జంగారెడ్డిగూడెం డివిజన్‌లో కలిసిన బూర్గం పాడు పరిధిలోని ఆరు గ్రామాలను కుకునూరు మండలంలో కలిపారని వెల్లడించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్ని కేఆర్‌పురం ఐటీడీఏలో కలిపే ఆలోచన ఉందని తెలి పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయూలన్నది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పా రు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు మేరకు గిరిజన జిల్లా ఏర్పాటుకు సంబంధించి తొలిదశలో అభిప్రాయ సేకరణ చేపట్టామన్నా రు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి రెండు నెలలు పట్టే అవకాశం ఉందన్నారు.  
 
 పోలవరం కేంద్రంగానే కావాలి
 ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న గిరిజన ప్రజాప్రతినిధులలో ఎక్కువ మంది రంపచోడవరాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు దూరం ఎక్కువగా ఉంటుందన్నారు. పోలవరాన్ని మధ్యస్థంగా తీసుకుని జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే అటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మండలాలకు అనువుగా ఉంటుం దని వివరించారు. పోలవరం ఎమ్మెల్యే మొడి యం శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున పోలవరాన్నే జిల్లా కేంద్రంగా చేస్తే బాగుం టుందన్నారు. దీనివల్ల నిర్వాసితులకు మేలు జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పా టు చేయాలంటే నిధులు అవసరమవుతాయన్నారు. రంపచోడవరంలో ఇప్పటికే ఉన్నతాధికారుల కార్యాలయాలు అనేకం ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు అంశంపై కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని సూచించారు. సమావేశంలో డీపీవో ఎ.నాగరాజు వర్మ, జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి ఆర్డీవో ఆర్‌వీ సూర్యనారాయణ, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పులి శ్రీనివాసులు , తహసిల్దార్ జేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
 
 ముంపు గ్రామాల అధికారుల డుమ్మా
 సమావేశానికి వేలేరుపాడు, కుకునూరు మండలాలకు చెందిన అధికారులు డుమ్మా కొట్టారు. జీలుగుమిల్లిలో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలోనూ ఆ మండలాల అధికారులెవరూ రాలేదు.  
 
 జంగారెడ్డిగూడెం నుంచే పాలన
 ఆగస్టు 1నుంచి కుకునూరు, వేలేరుపాడు మండలాలకు రేషన్ సరుకులతోపాటు ఆ ప్రాంతాల్లోని వారికి పింఛన్ల పంపిణీ వంటి పాలనాపరమైన కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ నుంచే జరుగుతాయని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. రెండు రోజుల్లో అక్కడి ప్రజలను కలసి వారి అవసరాలను తెలుసుకుంటామన్నారు.   
 
 సాక్షి, ఏలూరు: ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు గిరిజనులు సుముఖత వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతో పాటు, ఖమ్మం జిల్లానుంచి రెండు జిల్లాల్లోనూ కలిసిన మండలాలను కలిపి గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు 15 రోజుల క్రితం హైలెవెల్ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారని చెప్పారు. దీనిపై అభిప్రాయ సేకరణ చేశామన్నారు. జిల్లా కేంద్రం పోలవరంలో ఉండాలని కొందరు, రంపచోడవరంలో ఏర్పాటు చేయూలని మరికొందరు కోరుతున్నారన్నారు.
 
 ఈ వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హెడ్‌వర్క్స్, స్పిల్‌వే, పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ప్రాజెక్టు నిర్మాణానికి  సంబంధించి భూసేకరణ పూర్తయ్యిందని తెలి పారు. పునరావాస కాలనీకి అవసరమైన భూసేకరణ త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ముంపు మండలాల అధికారులు సాంకేతి కంగా మన జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ వారు ఖమ్మం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాలేదంటున్నారని, నిజానికి వాళ్లకూ తానే కలెక్టర్‌నని భాస్కర్ అన్నారు. ఆ విషయం నెలాఖరున జీతాలు ఇచ్చేప్పుడు ఆ అధికారులకు స్పష్టమవుతుందన్నారు.
 
 సెంట్రల్ యూనివర్సిటీకి స్థల సేకరణ
 సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలం చూడాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో 280 ఎకరాల విమానాశ్రయ భూము లు అందుబాటులో ఉన్నాయని, వెంకట్రామన్నగూడెం, చింతలపూడిలో అటవీ భూమిని కూడా గుర్తించామన్నారు. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు.

 

మరిన్ని వార్తలు