- ఆరుగురు దుర్మరణం
- పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా భీమినేనివారిపాలెం వద్ద ఘటన
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం భీమినేనివారి పాలెం వద్ద గురువారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ, కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. రెంటచింతల మండల కేంద్రంలో జరిగిన పెళ్లి వేడుకలకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పోసా వెంకటనారాయణ(47), గుంటూరులోని పరమాయకుంటకు చెందిన ముప్పూరి శ్రీనివాసరావు(32), శారదా కాలనీలో నివాసించే న్యాయవాది మాదాను రాజారావు(40), నెహ్రూనగర్కు చెందిన దాసరి కిరణ్(43), సుఖమంచి రాఘవేంద్రరావు(44), కర్నూలు జిల్లా నందవరానికి చెందిన పాణ్యం వెంకటసుబ్బారెడ్డి(47) మృతి చెందారు.
ప్రమాద ఘటనపై జగన్ తీవ్ర విచారం
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.