కాలం చెల్లిన వాహనాలకు చెక్‌

7 Mar, 2018 12:34 IST|Sakshi
సూచనలిస్తున్న కలెక్టర్‌ కోన శశిధర్‌

కలెక్టర్‌ కోన శశిధర్‌

గుంటూరు వెస్ట్‌:  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం అధికంగా ఉందని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించాలంటే కాలం చెల్లిన వాహనాలను తీసేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలిచ్చారు. పాత వాహనాలకు సరైన ఇంధనం వాడడం లేదన్నారు. దీంతో కాలుష్యం ఊహకందని విధంగా పెరిగిపోతుందన్నారు.  మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశం మందిరంలో జిల్లా కాలుష్య నియంత్రణా మండలి సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలో విపరీతంగా ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోయిందన్నారు. 2017లో నగరంలో ఒక ఘనపు మీటరుకు దుమ్ము సాంద్రత 66.5 మైక్రో గ్రాములు ఉందన్నారు. దీనిని 60 మైక్రో గ్రాములకు తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. కాలుష్య నివారణకు జిల్లా కాలుష్య నివారణ మండలి కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలు కూడా దీనిపై తమ వంతు బాధ్యతను గుర్తెరగాలని కలెక్టర్‌ కోరారు.  సమావేశంలో డీఆర్వో నాగబాబు,  జిల్లా కాలుష్య నియంత్రణా మండలి ఈఈవీఆర్‌.మహేశ్వరరావు, ఉప రవాణా కమిషనర్‌ రాజారత్నం, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం. అజయ్‌కుమార్, జిల్లా సరఫరాల అధికారి ఇ.చిట్టిబాబు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు