సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ పరలోకానికి

23 Jun, 2019 08:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ ఓ వృద్ధురాలు తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాలు... చోడవరం దరి భోగాపురానికి చెందిన ఆడారి కన్నంనాయుడు భార్య పిల్లలతో కలసి లంకెలపాలెంలో నివసిస్తున్నాడు. కూలిపనులు చేసుకుంటూ ఆ కుటుంబం బతుకుతోంది. కన్నంనాయుడు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మరణించిన భర్త కన్నంనాయుడి ఆత్మశాంతి కోసం బుధవారం మూలన కొత్త బట్టలు పెట్టడానికి భార్య మంగతల్లి (65), కుమారులు నాగార్జున, బంగారు నాయుడు నిర్ణయించారు.

ఈ మేరకు ముత్యాలమ్మపాలెం సముద్రంలో మైలస్నానం చేయడానికంటూ శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలపై తల్లీకొడుకులు వచ్చి స్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు. వెంకటపతిపాలెం దాటిన తరువాత కొట్టుమసేను మిల్లు వద్ద వాహనం వెనుక కూర్చున్న మంగతల్లి జారి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తల వెనుకవైపు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్లముందే తల్లి మృతి చెందడంతో కుమారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మంగతల్లికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా..ప్రమాదంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు