సాక్షి, గుంటూరు : ఒలింపిక్ క్రీడల్లో మొట్టమొదటి భారతీయ స్విమ్మర్, తెలుగు ప్రాంత వాసి షంషేర్ఖాన్ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. స్విమ్మింగ్ పోటీల్లో షంషేర్ ఖాన్ దేశానికి ఘనకీర్తిని తీసుకొచ్చారని అన్నారు. షంషేర్ ఖాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆ కుటుంబం మనోధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని కైతేపల్లికి చెందిన షంషేర్ ఖాన్.. ఒలింపిక్స్ ఈత పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయుడు. మెర్ల్బోన్ నగరంలో1956లో జరిగిన ఒలంపిక్స్లో ఆయన బరిలోకి దిగారు. పతకం తీసుకు రాలేకపోయినా.. 5వ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. తరువాత కాలంలో ఇండియన్ ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1962లో జరిగిన ఇండో-చైనా, 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధాల్లో పాల్గొన్నారు. ఆయన 1973లో ఆర్మీ నుంచి పదవీ విరమణపొందారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా బెంగళూరు సదరన్ కమాండ్లోని స్విమ్మింగ్ అకాడమీకి షంషేర్ ఖాన్ పేరు కూడా పెట్టారు.