అతిసారకు చిన్నారి బలి

16 Nov, 2013 04:47 IST|Sakshi

ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ :  ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గంటల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరింది. అతిసార రూపంలో మృత్యువు కబళించింది. గ్రామంలో పీరీలు, దోలా ఉత్సవాలు తిలకించి నిద్రలోకి జారుకున్న బాలిక ఆ తర్వాత శాశ్వత నిద్రలోకి చేరింది. ఈ సంఘటన మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో శుక్రవారం విషాదం మిగిల్చింది. తల్లిదండ్రులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన మడావి మధుకార్, లలిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, శ్రావణి ఉన్నారు. చిన్న కూతురు శ్రావణి(4) గురువారం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చింది.

మధ్యాహ్నం అక్కడే భోజనం చేసింది. గ్రామంలో పీరీలు, దోలా ఉత్సవాలు ఉండడంతో రాత్రి పది గంటలకు వరకు గ్రామస్తులు చేసిన నృత్యాలు చూస్తూ గడిపింది. ఆ తర్వాత నిద్రపోయింది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. తల్లిదండ్రులు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
 

>
మరిన్ని వార్తలు