రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

31 Dec, 2018 07:42 IST|Sakshi

గరివిడి:  చీపురుపల్లి నుంచి రాజాం వెðళ్లే ప్రధాన రహదారిలో బీజే పాలెం దాటిన తర్వాత ఎఫ్‌సీ గోడౌన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ముషిడివలస పంచాయతీ మధుర గ్రామమైన కొప్పలపేటకు చెందిన కొప్పల అప్పలస్వామి (32), రాగోలు సత్యం ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వైపు వెళ్తున్నారు. అదే మార్గంలో రాజాం వైపు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో బైక్‌ బోల్తా పడడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించగా.. అప్పలస్వామి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన రాగోలు సత్యంనకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం రాజాం కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పలస్వామి భవానీ మాల ధరించి విజయవాడ మొక్కు చెల్లించుకుని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ప్రసాదాలు పంపిణీ చేసేందుకు గాను దుమ్మెద గ్రామానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య రూపావతి, కుమార్తె రేణుక, కుమారుడు మణి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు