బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

12 Aug, 2018 10:54 IST|Sakshi

ఒకరి మృతిమరొకరికి తీవ్ర గాయాలు

మదనపల్లె క్రైం: మదనపల్లె మండలంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్టలో నివాసముంటున్న బండ కార్మికుడు తిరుమలకొండ వెంకటరమణ పెద్ద కుమారుడు పెద్దరామాంజులు (ఆంజి) (31) బండపని చేసి భార్య వెంకటలక్ష్మి, పిల్లలు నాగేశ్వరి, అజయ్, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. నీరుగట్టువారిపల్లె బాబుకాలనీ సమీపంలో సూరి ఇటుకల బట్టీలో ఇటుకలు వేస్తున్న పీటీఎం మండలం బురుజుపల్లెకు చెందిన జరిపిటి రామచంద్రయ్య కుమారుడు రామకృష్ణ (28)తో కలిసి సొంత పనిమీద ఆంజి ద్విచక్రవాహనంలో సీటీఎం బయలుదేరారు.

ఆరోగ్యవరం మెడికల్‌ సెంటర్‌ మలుపు వద్ద తిరుపతి నుంచి మదనపల్లెకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఏఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెద్దరామాంజులు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను ఆరోగ్యవరం మెడికల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ వెస్లి ఆదేశాల మేరకు ఏఎంసీ అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. ఆంజి కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐలు సునీల్‌కుమార్, కేవీహెచ్‌.నాయుడు తెలిపారు. 

మరిన్ని వార్తలు