వ్యక్తిగత కక్షలతో సర్పంచ్‌ దారుణహత్య

3 May, 2017 11:35 IST|Sakshi
వ్యక్తిగత కక్షలతో సర్పంచ్‌ దారుణహత్య

మాచవరం: వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సర్పంచ్‌ని దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని వేమవరం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..... గ్రామ సర్పంచ్‌ పోశం శ్రీనివాసరావు కుమార్తెల చదువు నిమిత్తం తన భార్యతో కలిసి  గుంటూరులో నివాసం ఉంటున్నాడు.  గ్రామంలో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వారంలో రెండు మూడు రోజులు వేమవరం వస్తూ ఉండేవాడు.

సోమవారం గ్రామంలో సాంఘిక నాటకం ప్రదర్శన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి నాటకాన్ని ప్రాంభించారు. కాసేపటి తర్వాత  తిరిగి ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించాడు. అదే అదునుగా భావించి గ్రామానికి చెందిన షేక్‌ బషీర్‌ , జమాల్, జిలానీ, సైదా, జోజిబాబు మరి కొంత మంది కాపుకాచి ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్‌ శ్రీనివాసరావును  కత్తులు, గొడ్డళ్లతో  విచక్షణా రహితంగా నరికారు.

అదే సమయంలో నాటకాన్ని చూసి  ఇంటికి వస్తున్న మృతుడి బావమరిది కురేల వెంకట్రామయ్య ను చూసి నిందితులు (పైన తెలిపిన వ్యక్తులు) పారిపోయారు. ఆరుబయట ఉన్న అరుగుల పై రక్తపు మరకలు చూసి కంగారుగా ఇంట్లోకి వెళ్లి చూడగా సర్పంచ్‌ శ్రీనివాసరావు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి, కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే  సరికి  అప్పటికే మృతి చెంది ఉన్నాడు.

మృతుడి బావ మరిది వెంకట్రామయ్య  ఫిర్యాదు మేరకు హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిడుగురాళ్ల సీఐ సుబ్బారావు, ఎస్సై జగదీష్‌  తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇన్‌చార్జి డీఎస్పీ విక్రమ్‌ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని చేరుకొని  రక్తపు మడుగులో ఉన్న  మృత దేహంపై ఉన్న  గాయాలను పరిశీలించారు. హత్యకు దారి తీసిన కారణాలను  అడిగి  తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు