అక్కాచెల్లెళ్లలో ఒకరి ఆచూకి లభ్యం

13 Feb, 2019 08:36 IST|Sakshi

విజయవాడ చేరుకున్న రెండో కుమార్తె సోనియా

తన కుమార్తెను అ‍ప్పగించాలని పోలీసులను వేడుకున్న తల్లి

గుణదల(విజయవాడ తూర్పు): కుటుంబ సమస్యల రీత్యా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వద్దకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఓ సోదరి మంగళవారం విజయవాడకు చేరుకుంది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగిరెద్దుల దిబ్బ కొండ ప్రాంతానికి చెందిన కోట గాయత్రి, కోట సోనియా ఇద్దరు ఈ నెల 4న చింతమనేనిని కలిసేందుకు వెళ్లారు. అప్పటి నుంచి వారిరువురి ఆచూకీ తెలియక పోవడంతో వారి తల్లి మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో రెండో కుమార్తె సోనియా మంగళవారం నగరానికి చేరుకుంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరులో తాను చదువుకున్న పాఠశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు తెలిపింది. తన అమ్మమ్మ అయిన భాగ్యలక్ష్మి ఇంటివద్దే ఉన్నట్లు చెప్పింది. తన అక్క గాయత్రి ఈ నెల 5నే ఏలూరు నుంచి విజయవాడ చేరుకున్నట్లు పోలీసుల వద్ద ఒప్పుకుంది. అనంతరం పోలీసులు సోనియాను ఆమె తల్లికి అప్పగించారు. గాయత్రి కోసం దర్యాప్తు ముమ్మరం చేస్తామని వారు తెలిపారు. తన పెద్ద కుమార్తెను తనకు అప్పజెప్పాలని తల్లి మీడియా వద్ద వేడుకుంది. 

మరిన్ని వార్తలు