రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

20 Sep, 2013 00:56 IST|Sakshi
తాళ్లరేవు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారి 216లోని కోరంగి పంచాయితీ సుబ్బారాయుని దిమ్మవద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లరేవు మండలం కోరంగిలోని ప్రతాప్ నగర్‌కి చెందిన మడికి అమ్మిరాజు (35) రొయ్యల కంపెనీలో దినసరి కూలీ. విధి నిర్వహణ నిమిత్తం సైకిల్‌పై వెళుతున్న అమ్మిరాజును ఉదయం 5.30 గంటల సమయంలో కాకినాడనుంచి అంతర్వేదికి రొయ్యల సీడుతో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. అమ్మిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
 రాజు మృతి విషయం తెలిసిన బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలంలో బైఠాయించారు. రహదారికి అడ్డంగా ముళ్లకంచెలు వేసి దిగ్బంధించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా రామచంద్రపురం సీఐ ఎ.రాంబాబు, కోరంగి ఇన్‌చార్జ్ ఎస్సై రమేష్‌లు ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. సుమారు 8 గంటల పాటు ఈ ఆందోళన సాగింది. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌లోని వ్యక్తులు ఆర్థిక సహాయం చేసేందుకు, వాహన యజమాని నుంచి నష్ట పరిహారం చెల్లించేందుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కోరంగి హెచ్‌సీ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు