అతనొక్కడే...

30 May, 2020 12:33 IST|Sakshi

ఒకే ఒక్కడుగా నిలిచి... విజయపతాకం ఎగురవేసి...

జిల్లాలో ప్రతిపక్షాన్ని నామరూపాల్లేకుండా చేసి...

ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జగనన్న

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాదిపూర్తి

తక్కువ సమయంలోనే ఎక్కువ సంక్షేమం

నవరత్నాల అమలుతో పాటు జిల్లాకు వరాలు  

ప్రజల మధ్యనే జిల్లా ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు

ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించింది... అసెంబ్లీలో అవమానాలు రాటు దేలేలా మార్చింది... మూడువేల ఆరువందల పైచిలుకు కిలోమీటర్ల ప్రజాసంకల్ప పాదయాత్రవల్ల ఎంతో మేలు జరిగింది. ప్రతి ఇంటి తలుపు తట్టేలా... ప్రతి హృదిని స్పందింపజేసేలా చేసింది... ప్రతి నిరుపేద కష్టాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం కల్పించింది. అసలైన నాయకుడెవరో జనానికి తెలిసింది. ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రతి గుండె తపించింది. ఆ తరుణం రానే వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించింది. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. జిల్లాలో ప్రతిపక్ష పార్టీని సమూలంగా ఊడ్చేసి... ఏకైక పార్టీగా రూపొందేలా చేసింది. అప్పుడే ఆ విజయానికి ఏడాది గడిచిపోయింది. మాటతప్పని... మడమతిప్పని నాయకత్వం... జిల్లా ప్రజలకు ఎంతో న్యాయం చేసింది. నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఇన్నాళ్లకు సంక్షేమ పాలన అంటే ఏమిటో జనానికి అవగతమైంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామం పండగ చేసుకుంటోంది.

సాక్షిప్రతినిధి, విజయనగరం: యువజన శ్రామిక రైతు(వైఎస్సార్‌) కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శనివారానికి ఏడాది పూర్తవుతోంది. జనం కోరుకున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం ముగుస్తుంది. తొలి ఏడాదిలోనే ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి తనదైన ముద్ర వేసుకుంది. వీటితోపాటు అభివృద్ధిపై తనదైన శైలిలో దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు కూడా పలు వరాలు ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జిల్లా వైద్య, పారిశ్రామిక, వాణిజ్య రంగాలను మెరుగు పరిచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్‌ అడుగుజాడల్లో ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా జిల్లాలోనిఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు నిత్యం ప్రజల్లో ఉంటూ, సంక్షేమ ఫలాలను వేరవేస్తున్నారు. జిల్లాకు అభివృద్ధి పథకాలను తీసుకువస్తున్నారు. ్చ

జిల్లాపై ముఖ్యమంత్రి ముద్ర: విజయనగరంలో 200 పడకలతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేశారు. ప్రస్తుతం కాలేజీ ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోంది. కాలేజీ ఏర్పాటు చేస్తే ఎంతోమంది విద్యార్ధులకు మేలు జరగడంతోపాటు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నా యి.  

మిమ్స్‌లో వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.  
పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేసింది. ఇందుకు స్థల సేకరణ జరుగుతోంది. ఆస్పత్రి అందుబాటులోకి వస్తే పార్వతీపురం డివిజన్‌లో ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గర కానున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకు మేలు జరగనుంది. ప్రస్తుతం వారు పెద్ద  వైద్యం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోంది.
కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నిల్‌ ఇస్తూ జీవో జారీ చేశారు. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
సాలూరు ప్రాంతంలో గిరిజన యూనివర్సటీ ఏర్పా టుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కొత్తవలస మండలంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకుంది. అయితే గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలో ఉండాలని భావించిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాలూరులో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పాచిపెంట మండలంలో స్థల పరిశీలన జరిగింది.
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. విమానాశ్రయానికి సంబంధించి 2500 ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో పనులు చేసేందుకు టెండర్లు ఖరారు చేసింది. జీఎంఆర్‌ సంస్థకు పనులు అప్పగించింది.
వీటితో పాటు నవరత్న పథకాలతో జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారు. శతాబ్దాల మురికిని పారదోలి కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. 

మరిన్ని వార్తలు