ఆధార్‌ కార్డు చూపిస్తే .. ఉల్లి గడ్డ

26 Sep, 2019 10:13 IST|Sakshi

కిలో ధర రూ.25

కుటుంబానికి కిలో చొప్పున విక్రయం

సాక్షి, మచిలీపట్నం :  కేవలం నెలరోజుల వ్యవధిలో మూడింతలు పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పెనుభారంగా మారిని ఉల్లిపాయలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లి విక్రయాలకు శ్రీకారం చుట్టింది.    ఉల్లి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి. నెలరోజుల కింద రైతుబజార్లలో కిలోరూ.16 నుంచి రూ.20లు పలికిన ఉల్లి ప్రస్తుతం జిల్లాలో కిలో రూ.55లు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ.60లు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. రైతు బజార్లలో ప్రస్తుతం కిలో ఉల్లి రూ.48లకు చేరింది.జిల్లాలో ప్రతిరోజు సగటున 70 టన్నులకు పైగా వినియోగం ఉంటుందని అంచనా.మన జిల్లా వాసులు ఎక్కువగా మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంత ఉల్లిపాయలనే వినియోగిస్తుంటారు. ఆ తర్వాత ఎక్కువగా షోలాపూర్, కర్నూల్‌ నుంచి వచ్చే ఉల్లిని వినియోగిస్తుంటారు.

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
 అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో అధిక వర్షాలు కురవడంతో అక్కడ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో జిల్లాకు సరుకు దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం వర్షాభావ పరిస్థితుల వల్ల ఉల్లి ఉత్పత్తి తగ్గింది.       కర్నూల్‌ మార్కెట్‌లో క్వింటా గరిష్టంగా రూ.4200లు పలుకుతోంది. హైదరాబాద్, మహారాష్ట్రాలోనూ రూ.4వేలకు పైగా ఉంది. దిగుబడి తగ్గిపోవడంతో ఉన్న కొద్దిపాటి సరుకును డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెంచుకుంటూ పోతున్నారు. ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగు తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణా చర్యలు చేపట్టింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహిస్తూనే..మరొక వైపు నుంచి డిమాండ్‌ తగ్గ ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ప్రభుత్వాదేశాల మేరకు రైతు బజార్లలో ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయించింది.ప్రస్తుతానికి కర్నూల్‌ నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కనీసం పదిరోజులకు సరిపడా లోడును రప్పించాలని నిర్ణయించింది.అప్పటికి దిగిరాకపోతే కర్నాటక నుంచి కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. కనీసం 10–15 టన్నుల ఉల్లి లోడులను కర్నూల్‌ నుంచి రప్పిస్తున్నారు. వీటిని రైతుబజార్లలో డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. కిలో రూ.25ల కే విక్రయించనున్నారు. అయితే ఆధార్‌ కార్డు లేదా రేషన్‌ కార్డులలో ఏదో ఒకటి చూపిస్తే కుటుంబానికి రోజుకు కిలో చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల వద్ద అవసరమైన మేరకు ప్రత్యేక పోలీస్‌ బందో బస్తు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు జిల్లా వ్యాప్తంగా కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ఉల్లి వ్యాపారులపై ఎక్కడైనా నిల్వ చేసారేమో గుర్తించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించాలని నిర్ణయిం చారు. ఉల్లిధర అదుపులోకి వచ్చే వరకు రైతు బజార్లలో ఉల్లికౌంటర్లు కొనసాగుతాయని మార్కెటింగ్‌ శాఖ ఏడీ మురళీకృష్ణ సాక్షికి తెలిపారు.

మరిన్ని వార్తలు