దిగిరావే ఉల్లి

23 Aug, 2015 05:12 IST|Sakshi

తాడేపల్లిగూడెం : నెల రోజులుగా ఆకాశ యానం చేస్తున్న ఉల్లి ధరలు దిగిరాకపోగా.. మరింత ప్రియం అవుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఎగబాకుతున్నాయి. శనివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు రకం ఉల్లి క్వింటాల్ రూ.6 వేలకు చేరింది. మహారాష్ట్ర ఉల్లి క్వింటాల్ రూ.6,500కు పెరిగింది. నాసిరకం ఉల్లి సైతం క్వింటాల్ రూ.5వేలు పలికింది. ఈ ప్రభావంతో రిటైల్ మార్కెట్‌లో కర్నూలు ఉల్లి కిలో రూ.65, మహారాష్ట్ర రకం రూ.70 అమ్ముతున్నారు. ప్రతి శనివారం కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 150 నుంచి 250 లారీల ఉల్లి వస్తుంది. ఈ శనివారం కేవలం 50 లారీల సరుకు మాత్రమే వచ్చింది.
 
 ఉల్లి ధరలు సంక్రాంతి వరకు తగ్గే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్నూలులో దిగుబడులు తగ్గటమే దీనికి కారణమని చెబుతున్నాయి. ఎకరానికి 10 టన్నుల ఉల్లిపాయల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం నాలుగు టన్నులు మాత్రమే రావడంతో ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. మహారాష్ట్రలో ఉల్లి పంటపై వానల ప్రభావం పడటంతో అక్కడా దిగుబడులు పడిపోయాయి. దీనికి తోడు వర్షానికి చేతికొచ్చిన పంట కుళ్ళిపోవడంతో మహారాష్ట్ర మండీలలో సైతం గుత్తగా క్వింటాల్ రూ.6 వేలకు కొనే పరిస్థితి వచ్చింది.
 

మరిన్ని వార్తలు