'ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తాం'

3 Aug, 2015 19:59 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే ఉల్లిపాయలు, కందిపప్పుకు మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి తగ్గడం వల్లనే ధర పెరిగిందని.. ఉల్లి ఉత్తత్తులు పెంచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా.. రైతు బజార్తో పాటు.. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఇప్పటికే సబ్సిడీతో రూ.20కే మార్కెట్లలో అమ్ముతున్నామని ఆమె అన్నారు. ఉల్లిపాయల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఉల్లి ధరలు తగ్గేంత వరకు ఎంతైనా కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పరిటాల సునీత అన్నారు.

మరిన్ని వార్తలు