ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్:ఉల్లిగడ్డ ధర మళ్లీ భగ్గుమంది. గత రెండు మూడు నెలలుగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. మొదట రూ. 60 నుంచి 100 రూపాయలవరకు ధర ఉండగా...గత నెలలో మాత్రం కిలో రూ. 40 నుంచి 45 రూపాయలకు విక్రయించారు. ఈ ధర చాలా రోజులు స్థిరంగా ఉంది. అయితే శని, ఆదివారాల్లో ఉల్లి రేటు మళ్లీ రూ.60కి చేరింది. ధరలు తగ్గుతాయని ఆశతో ఉన్న తరుణంలో మళ్లీ పెరగడం సామాన్య ప్రజల ను బెంబేలెత్తిస్తోంది. ధరలకు భయపడి సామాన్య ప్రజలు కొంత కాలంగా ఉల్లిగడ్డ కొనడమే మానేశారు. హైదరాబాద్ మార్కెట్లోనే ఉల్లిగడ్డ ధరలు పెరగడం వల్ల ఇక్కడ కూడా ధరలు పెంచి విక్రయించాల్సి వస్తోం దని ఇక్కడి వ్యాపారులు వాపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డ సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు.