సేంద్రియ వ్యవసాయం భేష్

15 Aug, 2013 04:02 IST|Sakshi

శాయంపేట, న్యూస్‌లైన్ : జిల్లాలో రైతులు సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించడం అభినందనీయమని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ అన్నారు. మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన రైతులతో సమావేశమయ్యూరు. ముందుగా సంస్థ బాధ్యులు, రైతులు ఆయనకు భారతీయ సంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికారు.

అనంతరం మారి సంస్థ ఆధ్యర్యంలో అమలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులను సొసైటీ డెరైక్టర్లు, రైతులు తెలిపారు. జీవ సంబంధ ఎరువుల వినియోగం.. ఉపయోగంపై మహిళా రైతు రజిత వివరించారు. అదేవిధంగా వ్యవసాయ సాగు పద్ధతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అలిస్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రసాయనిక, సేంద్రియ ఎరువులకు గల తేడాలపై ఆరా తీయగా... రైతులు చెప్పిన సమాధానంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రసాయనికి ఎరువుల వాడకాన్ని తగ్గించి... సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపడం శుభపరిణామమన్నారు.  

రైతులతో సమావేశం ముగిసిన అనంతరం శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలోని ఆలేటి తిరుపతికి చెందిన పత్తి పంటను అలిస్టర్ పరిశీలించారు. సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు గ్రామంలో ఏర్పాటు చేసుకున్న సొసైటి వివరాల రికార్డులను పరిశీలించారు. అరుణ్‌పిల్లే, మృణాలి, శంకన్‌సర్కార్, జేడీఏ రామారావు, డబ్ల్యూడబ్ల్యూఫ్ సీనియర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉమేశ్‌కృష్ణ, మారి సంస్థ కార్యదర్శి మురళి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నర్సింహారెడ్డి, రామ్మూర్తి, కృష్ణమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ కె.కేదారి, మారి సంస్థ క్లస్టర్ కోఆర్డినేటర్ గౌస్, సిబ్బంది పల్నాటి రాంబాబు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు