నీటి సరఫరాలోనూ ‘పచ్చ’పాతం!

16 Jan, 2019 12:18 IST|Sakshi
పీ కొండాపురంలో టీడీపీనేత ఇంటి వద్ద నీటి ట్యాంకర్‌ను ఆపిన దృశ్యం

పీ కొండాపురం దళితవాడ దుస్థితి

అనంతపురం  , పామిడి:ప్రభుత్వ పథకాలను కేవలం టీడీపీ నా యకులు, కార్యకర్తలు, సానుభూతి పరులకు ధారదత్తం చేసే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంతకు దిగజారరంటే సామాన్యులు నిత్యం వినియోగించే తాగునీటి విషయంలో కూడా పక్షపాతం చూపుతున్నారు. దీంతో పీ కొండాపురం దళితవాడ ప్రజలు ఆ నాయకులను ఛీ కొడ్తున్నారు. వివరాల్లోకెళ్తే.. పట్టణ మున్సిపాలిటీలోని పీ కొండాపురం దళిత వాడలో 250 కుటుంబాలకు 750 మంది జనాభా ఉంది.

కాలనీలో ఉన్న ఒక్క బోరు కాలనీవాసుల నీటి అవసరాలను తీర్చడం లేదు. దీంతో  మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్ల ద్వారా దళితవాడకు నీటిని సరఫరా  చేస్తున్నారు. నీటి సరఫరాలో అధికార పార్టీ పక్షపాతం చూపుతోంది. దళితకాలనీలోని అధికార పార్టీ వారి ఇళ్ళ వద్దకే మున్సిపల్‌ అధికారులు ట్యాంకర్‌ను పంపుతూ అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు కాలనీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. కాలువలు పూడికతీతకు నోచుకోకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులకు గురౌతున్నారు.

తాగునీటి కోసం తల్లడిల్లుతున్నాం..
గ్రామంలోని ఎస్సీ కాలనీలో నెల రోజులుగా పక్షపాత ధోరణితో ట్యాంకర్లను కాలనీకి సక్రమంగా పంపడం లేదు.  తాగునీరు లేక తల్లడిల్లి పోతున్నాం. గత్యం తరం లేక గ్రామానికి రెండు ఫర్లాంగుల దూరంలోని వ్యవసాయబావులను ఆశ్రయిస్తున్నాం                             – సుంకమ్మ, దళితవాడ వాసి, పీ కొండాపురం

మరిన్ని వార్తలు