ఏలూరు రూరల్, న్యూస్లైన్ : జిల్లాలో ఆదివారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షకు అతి స్వల్పంగా 66.04 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో 25 పోస్టులకుగాను 24 వేల 562 మంది దరఖాస్తు చేసుకున్నారు. 16 వేల 222 మంది మాత్రమే హాజరయ్యారని జడ్పీ సీఈవో డి వెంకటరెడ్డి తెలిపారు. 8వేల 341 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. ఉదయం జరిగిన మొదట పరీక్షకు హాజరైన అభ్యర్దుల్లో సుమారు 5 శాతం మంది మధ్యాహ్నం జరిగిన రెండో పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ ఉద్యోగాల భర్తీకి జిల్లా స్థాయిలో పోటీ పరీక్ష నిర్వహించటం ఇదే ప్రథమం. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జెడ్పీ సీఈవో చెప్పారు. ఓఎంఆర్ షీట్లు అందజేతలో కొన్నిచోట్ల ఇన్విజిలేటర్లు తికమక పడ్డారని అభ్యర్థులు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు కలెక్టర్ ఆధ్వర్యంలో 21 మంది జిల్లాస్థాయి అధికారులు లయజన్ ఆఫీసర్లుగా, 10 మందితో కూడిన రెండు స్క్వాడ్ బృందాలు పనిచేశాయి.
జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకులోని 85 కేంద్రాలో పరీక్షలు నిర్వహించారు. పట్టణాల వారీగా హాజరు శాతం ఇలా ఉంది.
పరీక్ష కేంద్రం దరఖాస్తు చేసుకున్న వారు హాజరైన వారు
ఏలూరు 14 వేల 941 9వేల 786
తాడేపల్లిగూడెం 4 వేల 352 2వేల 914
తణుకు 5 వేల 269 3వేల 521