పిలిస్తే పలకడం లేదని.. మహిళపై కత్తితో దాడి

16 Nov, 2017 10:52 IST|Sakshi

 ప్రాణాపాయ స్థితిలో కేజీహెచ్‌కు తరలింపు

 మహిళను పరిశీలించిన ఎస్పీ పాలరాజు   

శృంగవరపుకోట రూరల్‌ : కొన్నేళ్లుగా తనతో కలిసిమెలిసి తిరిగిన వివాహిత మహిళ కొద్ది నెలలుగా తాను పిలిచినా పలకడం లేదనే కోపంతో ఓ వ్యక్తి కత్తితో ఆ మహిళపై దాడి చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు, గాయపడ్డ మహిళ బంధువులు తెలిపిన వివరాలు... మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన శానాపతి రమణమ్మ(45) మల్లిపూడి క్వారీల సమీపంలో ఉన్న పొలంలో పని చేస్తున్న అన్నదమ్ములకు బుధవారం మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్తుండగా ఆమెను అనుసరించిన యండపల్లి జగ్గారావు పిలిచి ఇటీవల ఎందుకు తనకు దూరంగా ఉంటున్నావని నిలదీశాడు. 

దీనిపై స్పందించిన ఆమె తన భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నానని తన మానాన తనను వదిలేయాలని చెప్పి వెళ్లిపోతుండగా జగ్గారావు కత్తితో దాడి చేశాడు. రమణమ్మ మెడ, వీపు, ముఖం, చేతి భాగాలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రమణమ్మ కేకలు వేయగా స్థానికులు చేరుకుని 108 వాహనం, పోలీసులకు సమాచారమిచ్చారు. రమణమ్మను ఎస్‌.కోటలోని సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు.  నిందితుడు జగ్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌.కోట ఇన్‌చార్జి సీఐ లలిత పరిశీలించారు. ఎస్‌ఐ మారూఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కఠిన శిక్ష పడేలా చూస్తాం : ఎస్పీ 
రమణమ్మ విషయం తెలుసుకున్న  ఎస్పీ జి.పాలరాజు సీహెచ్‌సీకి చేరుకుని ఆమె పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  ఎస్‌ఐని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చట్ట ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీనిచ్చారు.  
 

మరిన్ని వార్తలు