ఉద్దండుల అడ్డా.. పర్చూరు గడ్డ..!

16 Mar, 2019 11:20 IST|Sakshi

సాక్షి, పర్చూరు (ప్రకాశం): రాజకీయమంటే రసవత్తరమే.. ఎత్తులు, పై ఎత్తులు, ప్రచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఓట్ల పండగే.. ఇలాంటి వాతావరణం పర్చూరు నియోజకవర్గంలో మెండుగా ఉంటుంది.. ఉద్దండులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి సేవల్లో అగ్రగాములుగా నిలిచారు. మరో వైపు ఈ నియోజకవర్గానికి ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.

దగ్గుబాటి రామానాయుడు ఎన్నికల ప్రస్థానం...

♦ సినీ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు 1999లో టీడీపీ రాజకీయ ప్రవేశం చేశారు. అనంతరం 1999లో టీడీపీ తరఫున బాపట్ల పార్లమెంట్‌ నుంచి దగ్గుబాటి రామానాయుడు పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్తి జె.డి.శీలం పై 92,457 ఓట్లతో గెలుపొందారు.

గాదె వెంకటరెడ్డి ఎన్నికల నేపథ్యం...
♦ 1967 లో పర్చూరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గాదె వెంకటరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎన్‌. వెంకటస్వామి పై 10,427 ఓట్లతో గెలుపొందారు.
♦ 1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల ఆంజనేయులపై 14,510 ఓట్లతో గెలుపొందారు.
♦ 1994 లో పర్చూరు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి బత్తుల బ్రహ్మానందరెడ్డి పై 2,202 ఓట్లతో గెలుపొందారు.
♦ 1994లో గాదె వెంకటరెడ్డి ఎక్సైజ్‌ శాఖామంత్రి గా పనిచేశారు.

దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ నేపథ్యం...
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కుమార్తెగా, మాజీ మంత్రి వర్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్యగా  దగ్గుబాటి పురంధేశ్వరికి మంచి గుర్తింపు ఉంది. 2004 సంవత్సరంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరిక.
 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థినిగా దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి రామనాయుడు పై 94,082 ఓట్లతో గెలిచారు.
♦ 2006 లో దగ్గుబాటి పురేంధేశ్వరి కేంద్ర మానవవనరుల సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
♦ 2009లో బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ రిజర్వుడు కావడంతో, విశాఖపట్నం నుంచి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై 66,686 ఓట్లతో గెలుపొందారు.
♦ 2009లో దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మానవవనరుల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
♦ 2014 లో ఆంధ్రప్రదేశ్‌ అడ్డగోలు విభజనతో కాంగ్రెస్‌తో విభేదించి, రాజీనామా చేసి బీజేపీలో చేరిక.
♦ 2014 లో బీజేపీ తరఫున రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి.
♦ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా పదవులు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

పర్చూరు: జిల్లాలో ప్రముఖులను అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పంపిన ఘనత పర్చూరు నియోజకవర్గానికే దక్కుతుంది. జిల్లాలో ముగ్గురు మంత్రులుగా పనిచేసినవారు పర్చూరు నియోజకవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇలా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేదు. జిల్లాలో మహిళా మంత్రిగా చేసిన పనిచేసిన ఘనత పర్చూరు నియోజకవర్గానికే దక్కుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా పర్చూరు నియోజకవర్గం మళ్లీ 2019లో జరగబోయే  సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు దగ్గుబాటి పురంధేశ్వరీ ఎంపీలుగా పోటీ చేశారు.

జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి...
పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా జాగర్లమూడి లక్ష్మీపద్మావతి.
♦ 1999లో టీడీపీ అభ్యర్థిగా జాగర్లమూడి లక్ష్మీపద్మావతి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 2,209 ఓట్లతో గెలుపొందారు. 
♦ 1999 లో జాగర్లమూడి లక్ష్మీపద్మావతి వాణిజ్యశాఖ మంత్రిగా పనిచేశారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రస్థానం...
♦ 1985 లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి పై 1077 ఓట్లతో గెలుపొందారు.
♦ 1989లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 6,828 ఓట్లతో గెలుపొందారు.
♦ 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్యపై 15,546 ఓట్లతో గెలుపొందారు.
♦ 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి నరసింహారావు పై 2,960 ఓట్లతో గెలుపొందారు. 
♦ 1991 సంవత్సరంలో టీడీపీ తరఫున బాపట్ల ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి సలగల బెంజిమిన్‌ పై 1077 ఓట్లతో గెలుపొందారు.
♦ 1996–2002 మధ్య రాజ్యసభ ఎంపీగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు.
♦ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో 11–7–1987 లో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ మినిస్టర్‌ గా పనిచేశారు.

గెలుపొందిన వారు వీరే -  ఇప్పటికి 14సార్లు ఎన్నికలు

1955లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కె. రామయ్య, సీపీఐ అభ్యర్థి కె. వెంకయ్యపై 5,501 ఓట్లతో గెలుపొందారు.
1962లో సీపీఎం అభ్యర్థి ఎన్‌. వెంకటస్వామి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎం. నారాయణరావుపై 8041 ఓట్లతో గెలుపొందారు.
1967లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎన్‌. వెంకటస్వామిపై 10,427 ఓట్లతో గెలుపొందారు.
1972లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మద్దుకూరి నారాయణరావు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 310 ఓట్లతో గెలుపొందారు.
1978లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా మద్దుకూరి నారాయణరావు, జనతాపార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 4937 ఓట్లతో గెలుపొందారు.
1983లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి చౌదరి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 6,614 ఓట్లతో గెలుపొందారు.
 985లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 1077 ఓట్లతో గెలుపొందారు.
989లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై 6,828 ఓట్లతో గెలుపొందారు.
1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి దామచర్ల ఆంజనేయులుపై 14,510 ఓట్లతో గెలుపొందారు.
1994లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి బత్తుల బ్రహ్మానందరెడ్డిపై 2,202 ఓట్లతో గెలుపొందారు.
1999లో టీడీపీ అభ్యర్థి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి పై 2,209 ఓట్లతో, 2004లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి బి. చెంచుగరటయ్యపై 15,546 ఓట్లతో, 2009లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. టీడీపీ అభ్యర్థి జి. నరసింహారావుపై 2,960 ఓట్లతో గెలుపొందారు.
2014లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌పై 10,775 ఓట్లతో గెలిచారు. గెలుపొందారు.

పర్చూరు
పర్చూరు నియోజకవర్గంది జిల్లాలో ఒక ప్రత్యేక ప్రస్థానం. ఇక్కడి ఓటర్లు అన్నిపార్టీలనూ ఆదరించినప్పుటికీ ప్రధాన పార్టీల  అభ్యర్థులే ఎక్కవసార్లు గెలుపొందారు. నియోజకవర్గం 1955లో ఏర్పడగా ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో పర్చూరు, కారంచేడు, చినగంజాం, ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరు మండలాలున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో తలపడిన కాంగ్రెస్‌ పార్టీ 7 సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక ఎనిమిది సార్లు ఆపార్టీ అభ్యర్థులు బరిలో నిలవగా 4 సార్లే విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులపై రెండుసార్లు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు విజయం సాధించారు. 1972లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మద్దుకూరి నారాయణరావు, 1983లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి చౌదరి  విజయం సాధించారు. ఇక్కడి నుంచి సీపీఎం అభ్యర్థి సైతం ఒకసారి 1962లో గెలుపొందారు. ఎక్కువసార్లు కాంగ్రెస్, టీడీపీలు తలపడ్డాయి.

ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ 
రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిగా తన ఉనికి కోల్పోయింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసేందుకు నియోజకవర్గంలో అభ్యర్థి కరువయ్యారు. గత ఎన్నికల్లో ప్రధాన పోరు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య పోటీ జరిగింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారబోతుంది.

మరిన్ని వార్తలు