తల్లిదండ్రులున్నా అనాథలుగా మారిన చిన్నారులు

4 Jul, 2019 12:02 IST|Sakshi
చిన్నారులతో మాట్లాడుతున్న తడికలపూడి ఎస్సై సతీష్‌కుమార్‌

సాక్షి, కామవరపుకోట(పశ్చిమగోదావరి) : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఆ చిన్నారుల్ని వదిలేసి ఎటో వెళ్లిపోయింది. తండ్రి మద్యానికి బానిసై పిల్లల్ని రోడ్డున పడేశాడు. దీంతో అమ్మా నాన్న ఉన్నప్పటికీ అభం శుభం తెలియని ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. కామవరపుకోట మండలం 93 రామన్నపాలెం గ్రామంలో తల్లిదండ్రులుండి అనాథలుగా మారిన ఆ ఇద్దరు చిన్నారుల్ని పోలీసులు చేరదీశారు. గ్రామ డ్వాక్రా మహిళల ద్వారా సమాచారం తెలుసుకున్న తడికలపూడి ఎస్సై సతీష్‌కుమార్‌ గ్రామానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ఆ పిల్లల్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి  అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఎస్సై సతీష్‌కుమార్‌ తెలిపిన సమాచారం ప్రకారం.. రామన్నపాలెం గ్రామానికి చెందిన ఆడమిల్లి అర్జునరావు, అతని భార్య మరియమ్మలు కుటుంబ కలహాలతో విడిపోయారు. పాప నాగదుర్గ(4), బాబు చిన్ను(3)లను వదిలేసి తల్లి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. తండ్రి కూడా ఇంటికి రాకుండా ఆ పిల్లల్ని అనాథలుగా వదిలేశాడు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని వారిని బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. 

>
మరిన్ని వార్తలు