ఈ–బైక్‌..15 గంటల్లో తయారైంది

10 Oct, 2019 10:07 IST|Sakshi

పార్వతీపురం కుర్రాడి ప్రతిభ

పార్వతీపురం: ఈ కుర్రాడి పేరు గెంబలి గౌతమ్‌ విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన వాసు, లక్ష్మి దంపతుల కుమారుడు. చదివింది కంప్యూటర్‌ సైన్స్‌. కానీ.. మెకానిజంలో ప్రయోగాలు చేస్తున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచి్చనపుడు ఏటా ఏదో ఒకటి చేయడం గౌతమ్‌ హాబీ. ఈ ఏడాది తన స్నేహితుడైన వెల్డర్‌ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్‌ రూపొందించాడు. దానిని రెండు గంటలపాటు చార్జింగ్‌ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు.

ఇలా చేశాడు..
వాహనం తయారీకి గౌతమ్‌ పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్‌ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్‌డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్‌ సిస్టం, హ్యాండ్‌ బ్రేక్‌ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్‌ లైట్‌ అమర్చాడు. పట్టణానికి చెందిన  ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్‌ ఎలక్ట్రికల్‌ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా ముగిసిందని గౌతమ్‌ చెబుతున్నాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ చేసిన గౌతమ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాషన్‌ కంపెనీలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకూ నాలుగు బైక్‌లు, ఒక కారు తయారు చేశాడు. మెజీషియన్‌గా పలు వేదికలపై ప్రదర్శనలిచ్చి మెప్పించాడు.

పోలీసు కేసులు ఉండకూడదనే.. 
బైక్‌పై వెళుతుంటే పోలీసులు అడ్డుకుని.. లైసెన్సు ఉందా, హెల్మెట్‌ ఉందా,  సీ బుక్‌ ఉందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండేవారు. అవి లేకపోతే కేసులు రాసేవారు. ఇలా పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఫైన్లు కట్టడం ఇష్టం లేక ఏం చేయాలా అని ఆలోచించి ఈ–బైక్‌ తయారు చేశా. ఇది సైకిల్‌ మాదిరిగా ఉంటుంది. బరువు తక్కువ. హెల్మెట్, సీబుక్‌ అక్కరలేదు. డీజిల్, పెట్రోల్‌తో పనిలేదు. దీనివల్ల కాలుష్యం కూడా ఉండదు. ప్రభుత్వం సహకారం అందిస్తే ఇటువంటి వాటిని తయారు చేస్తాను. పేటెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నాను.  
గెంబలి గౌతమ్‌ ,పార్వతీపురం

మరిన్ని వార్తలు