20 రోజుల్లో పాస్‌పోర్ట్‌ సేవలు ప్రారంభం

2 Mar, 2018 06:42 IST|Sakshi
పోస్టల్‌ అధికారులతో మాట్లాడుతున్న ఎంపీ వైవీ, ఎమ్మెల్యే సురేష్‌

ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

అనుమతి వచ్చి ఏడాదైనా అధికారుల

అలసత్వంపై ఎంపీ అసహనం

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లాకు పాస్‌పోర్ట్‌ కార్యాలయం అనుమతి వచ్చి ఏడాది కావస్తున్నా ఆచరణలో పోస్టల్‌ అధికారులు కార్యాలయ ప్రారంభానికి శ్రద్ధ చూపక పోవడంపై ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత జిల్లా వాసులు పాస్‌పోర్ట్‌కు చెన్నె లేదా విజయవాడ పదేపదే వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీత్యా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాకు ప్రాంతీయ పాస్‌ పోర్ట్‌ కార్యాలయం అనుమతి తీసుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

గురువారం ఒంగోలు హెడ్‌ పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్‌ కార్యాలయం ప్రారంభించడానికి భవన పరిశీలనకు వచ్చిన ఎంపీ అధికారులను మార్చి నెల ఆఖరు లోపు జిల్లాలో పాస్‌పోర్ట్‌ కార్యాలయ సేవలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని, అందుకు కావాల్సిన అన్ని చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పోస్టల్‌ అధికారులను కోరారు. ఈ విషయమై పీఎంజీ రాధికా చక్రవర్తి జిల్లాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 20 రోజుల్లోగా జిల్లాలో పాస్‌పోర్టు సేవలు ప్రారంభిసా ్తమన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంట సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, జిల్లా పోస్టల్‌ అధికారులు సీనియర్‌ సూపరింటెండెంట్‌ టీఏవీ శర్మ, పి.వెంకటేశ్వరరావు, పోస్టల్‌ పెన్షనర్స్‌ యూనియన్‌ నాయకులు పి.పేరయ్య, కె.వీరాస్వామిరెడ్డి, కె.వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎంపీ వెంట పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు