నిందితురాలిని విడిచి మాపై కేసులా?

5 Oct, 2018 08:57 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పట్టపు రవి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పట్టపు రవి

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): దళిత విద్యార్థిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పి అతని మృతికి కారణమైన రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ్ముడు భార్యను అరెస్టు చేయకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్న బీఎస్పీ నాయకులపై కేసులు పెడుతున్నారని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏపీ అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గత నెల 28న దళిత విద్యార్థి ఎన్‌.వరుణ్‌ తోటివారితో కలిసి ఆడుకునేందుకు అమలాపురంలోని హౌసింగ్‌ కాలనీకి వెళ్లాడని, ఆ సమయంలో హోంమంత్రి మరదలు పెంపుడు కుక్కను ఉసిగొల్పిందన్నారు. దానినుంచి తప్పించుకునే క్రమంలో వరుణ్‌ పక్కనే ఉన్న ఎర్రకాలువలో పడి మృతిచెందాడని చెప్పారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు స్పందించటంలేదన్నారు. విద్యార్థి మృతికి కారణమైన మహిళను 2 రోజుల్లో అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చలకూర పుష్పరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లంకా కరుణాకర్‌ దాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు