నా బిడ్డను పవన్‌ కల్యాణ్‌ పట్టించుకోలేదు

27 Nov, 2018 09:46 IST|Sakshi
ఆస్పత్రిలో కుమారుడితో తండ్రి వీరబాబు

బాధితుడి తండ్రి వీరబాబు ఆవేదన

సాక్షి, రాజమహేంద్రవరం: అభిమానులు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో గాయపడి కిడ్నీని కోల్పోయిన తన కుమారుడిని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితుడి తండ్రి మొళ్ల వీరబాబు వాపోయారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట. గత నెల 9న దేవరపల్లిలో పవన్‌ అభిమానుల బైక్‌ ర్యాలీలో పాల్గొన్న నా కుమారుడు రాజ మనోహర్‌ను బైక్‌ ఢీ కొట్టింది. మరో బైక్‌ అతనిపై నుంచి వెళ్లింది.

తీవ్ర గాయాలపాలైన రాజ మనోహర్‌ను స్నేహితులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కిడ్నీని తొలగించి ప్రాణాలు కాపాడగలిగారు. నా కుమారుడి స్నేహితులు కొవ్వూరు సభలో పవన్‌కు నా కుమారుడి ప్రమాద ఫొటోలు చూపించారు. అయితే ఆయన మనోహర్‌ ఎలా ఉన్నాడని కూడా అడగలేదు. దీంతో రూ.5 లక్షలు అప్పు చేసి బిడ్డను కాపాడుకున్నా. తాజాగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలోనే ఉంటున్నాం. నా బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటా.

దాతలు.. ‘మొల్ల వీరబాబు, పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడి, ఆంధ్రా బ్యాంక్‌ ఖాతా నంబర్‌ 078910100059571, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఏఎన్‌డీబీ0000789’ ద్వారా సహాయం చేయొచ్చు.

మరిన్ని వార్తలు