నగరంలో పాయల్‌ మెరుపులు

10 Nov, 2018 10:50 IST|Sakshi

బీఎంఆర్‌ షోరూం ప్రారంభం

ప్రముఖ సినీ నటి, ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ ఒంగోలు నగరంలో సందడి చేసింది. మంగమూరు రోడ్డులో బీఎంఆర్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ జ్యూవెలరీ షోరూం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె ధగధగలాడే ఆభరణాలతో మెరిసిపోయింది. పాయల్‌ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

ఒంగోలు: నాలుగు తరాలుగా బంగారు, వజ్రాభరణాల విక్రయంలో బీఎంఆర్‌ సంస్థ ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలిచిందని సినీ హీరోయిన్‌ (‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం) పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. శుక్రవారం ఉదయం ఒంగోలులోని మంగమూరు డొంకలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎంఆర్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూంను ఆమె ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రకాల వజ్రాభరణాలను పాయల్‌ ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బొమ్మిశెట్టి మల్లికార్జునరావు ప్రారంభించిన సంస్థను వారి వారసులు కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం వల్లే నేడు మల్టిపుల్‌ షోరూంలను ప్రారంభించగలుగుతున్నారన్నారు.

షోరూంలో దక్షిణ భారత సంప్రదాయం, సంస్కృతులను ప్రతిబింబించే బంగారు, వజ్రాభరణాలను అందుబాటులో ఉంచారన్నారు. షోరూం అధినేత బొమ్మిశెట్టి అర్జున్‌ మాట్లాడుతూ కాలానుగుణంగా ప్రజలు మెచ్చే అన్ని రకాల వజ్రాభరణాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తమ షోరూంలో 200 రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి 8 గ్రాముల బంగారంపై రూ.1025 తగ్గింపు ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ‘మీ టూ’ అంశం అత్యంత సున్నితమైనదిగా పేర్కొన్నారు. తెలుగులో తనకు ఆర్‌ఎక్స్‌ 100 సినిమా మంచి బ్రేక్‌ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం తెలుగులో హీరో రవితేజతో రెండో సినిమాతోపాటు తమిళ్‌లో ఏంజెల్‌ మూవీ చేస్తున్నట్లు తెలిపారు. షోరూం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు