‘ఆర్‌ఎక్స్‌ 100’తోనే గుర్తింపు

12 Nov, 2018 08:59 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌

హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: ఇటీవల విడుదలై విజయవంతమైన ‘ఆర్‌ఎక్స్‌ 100’తోనే తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు లభించిందని ఆ చిత్రం హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. ఆ చిత్రం విజయవంతంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, మరో రెండు తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించబోతున్నానని తెలిపారు. అమలాపురంలో ‘దుర్గాస్‌ స్పైసీ ట్రీట్‌ రెస్టారెంట్‌’ను ఆమె ఆదివారం ఉదయం ప్రారంభించారు. రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హీరో రవితేజ నటించే చిత్రంతో పాటు మరో కొత్త చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు.

తన సొంత రాష్ట్రం పంజాబ్‌ అని,  హిందీ టీవీ సీరియల్స్‌లో  నటిగా గుర్తింపుతోనే సినిమాల్లో అరంగేట్రం చేశానని పేర్కొన్నారు. హిందీ టీవీ షోల్లో కూడా నటించానన్నారు.  2012లో ‘ సప్నా సే భారే నైనా’ అనే హిందీ టీవీ సీరియల్‌తో నట జీవితాన్ని ప్రారంభించానని చెప్పారు.  తమిళంలో కూడా నాలుగు చిత్రాల్లో నటించానని, అవి కూడా విజయవంతమయ్యాయని చెప్పారు. కోనసీమకు రావడం ఇదే తొలిసారని, ఇంత పచ్చదనాన్ని, గోదావరి పాయలను చూసి ఇక్కడ ఉండిపోవాలన్నంత అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో రెస్టారెంట్‌ యజమాని సత్తి సూర్య ప్రకాష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు