'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం

2 Feb, 2017 10:35 IST|Sakshi
'అనంత'లో టీడీపీ నేతల దాష్టీకం

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో సామాన్య ప్రజలను, తమకు ఎదురొస్తే పార్టీలోని చిన్న నేతలపై, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపై సైతం దాడులకు వెనుకాడటం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర మహిళపై దాడిచేస్తూ కాళ్లతో తన్ని హింసించారు. వీరంతా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరులని సమాచారం. సమస్యపై ప్రశ్నించినందుకే సుధ అనే మహిళను అందరూ చూస్తుండగానే దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపివేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.