కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళలు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పేదలకు వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకం, సహాయం పొందని కుటుంబమే లేదని అన్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాలు వైఎస్సార్ను ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేశాయని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత దివంగత నేతకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిసిస్తోందన్నారు. నిరంతరం పేదల సంక్షేమం గురించే ఆలోచించే వారని, బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్కే చెందుతుందని అన్నారు. ఆయన ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని తెలిపారు.