ఇసుక బుకింగ్‌ మరింత సరళతరం

2 Jun, 2020 03:46 IST|Sakshi

ఆన్‌లైన్‌ మోసాలకు పూర్తిగా చెక్‌ 

గ్రామ సచివాలయాల నుంచి బుకింగ్‌లకు అవకాశం 

ఇసుక బల్క్‌ బుకింగ్‌కు కొత్త నిబంధనలు 

రీచ్‌ నుంచి పది కిలోమీటర్ల పరిధిలోనే స్టాక్‌ యార్డు 

వినియోగదారులపై రవాణా భారం తగ్గింపునకు చర్యలు 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం తర్వాత అమలు 

ఇసుక పాలసీపై సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్‌ను మరింత సరళతరం చేసి ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌ పెడతామని భూగర్భ గనులు, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించే విషయం ఆలోచిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో సోమవారం ఆయన ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇసుక పాలసీపై సమీక్షించారు. ‘సచివాలయాల ద్వారా ఏపీఎండీసీ నుంచి వినియోగదారులు ఇసుక కొనుగోలు చేసే అవకాశం కల్పించవచ్చు. దీనివల్ల గ్రామస్థాయిలో వినియోగదారుడికి ఇసుక లభ్యత మరింత సులభమవుతుంది. ఈ నూతన విధానంపై సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించి ఆయన సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’.. అని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌ తదితరులు 

► బల్క్‌ బుకింగ్‌లకు కూడా కొత్త నిబంధనలు అమలుచేస్తాం. అక్రమాల కట్టడి కోసం ప్రతి బల్క్‌ బుకింగ్‌ను జిల్లా స్థాయిలో పునఃపరిశీలన చేసే ఏర్పాట్లుచేస్తాం. 
► ప్రతి రీచ్‌కు పది కిలోమీటర్ల పరిధిలోనే స్టాక్‌యార్డ్‌ ఏర్పాటుచేయాలి. తద్వారా ఇసుక రవాణాభారం వినియోగదారులపై తగ్గించాలి.
► రాజమండ్రి నుంచి విశాఖకు ఇసుక రవాణా చెల్లింపులను కిలోమీటరుకు టన్నుకు రూ.4.90 నుంచి రూ.3.30కి తగ్గించాం. 
► వర్షాకాలంలో అవసరాల కోసం 70 లక్షల టన్నుల ఇసుక నిల్వలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించగా ఇప్పటివరకు 40 లక్షల టన్నులు సిద్ధంచేశాం. వచ్చే 20 రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తిచేయాలి.
► ఇసుక రవాణాదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
► జీపీఆర్‌ఎస్‌ పరికరాలు లేని వాహనాలను ఇసుక రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు. 
► రాత్రి పూట ఇసుక ఆపరేషన్లు తగ్గించాలి. 
► పర్యావరణ నిబంధనల ప్రకారం తవ్వకాలు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మైనింగ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్, జేసీ మాధవీలత, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు