వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దం

30 Apr, 2020 12:49 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు

రూ.1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వం.

ఇప్పటికే గ్రామ, వార్డు కార్యదర్శుల ఖాతాల్లోకి సొమ్ము జమ

వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షనర్ల చేతికే పెన్షన్ సొమ్ము.

పెన్షన్ల పంపిణీలో 2,37,615 మంది వాలంటీర్లు.

బయోమెట్రిక్కు బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్.

లాక్ డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో వున్న వారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు.

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైస్ఆర్ పెన్షన్ కానుకను మే నెల ఒకటోతేదీన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవైపు కరోనా నిబంధనలను పాటిస్తూనే, మరోవైపు లక్షలాధి మంది పెన్షనర్ల చేతికే ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 71 కరోనా కేసులు)

కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయో మెట్రిక్ కు బదులుగా ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా జియోట్యాగింగ్ తో కూడిన ఫోటోలను యాప్‌ లో అప్ లోడ్ చేస్తారని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే మొత్తం వాలంటీర్లకు ప్రభుత్వం అందచేసిన ఫోన్ లలో అధికారులు ఈ ప్రత్యేక యాప్ ను డౌన్ లోడ్ చేయించారని అన్నారు. మే నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం 1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, ఇప్పటికే ఈ మొత్తంను పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ఫ్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు. (శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్‌)

సచివాలయ కార్యదర్శుల నుంచి సొమ్మును వాలంటీర్లకు అందచేయడం ద్వారా, శుక్రవారం (మే 1వ తేదీ) ఉదయం నుంచే నేరుగా పెన్షనర్ల చేతికి పింఛన్ సొమ్ము అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల వరకు భాగస్వాములు అవుతున్నారని, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో వుండిపోయినట్లయితే, వారిని కూడా గుర్తించి, పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. (వద్దన్నా.. వినరేం)

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందించాలన్న ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో పెన్షన్ సొమ్మును జమ చేస్తున్నామని పేర్కొన్నారు. 
 

వివిధ రకాల పెన్షన్ల వివరాలు:

కేటగిరి   పెన్షన్ల సంఖ్య   రూ.కోట్లలో..
వృద్ధాప్య పెన్షన్లు 2592072    598.12
అభయహస్తం  71287          3.74
చేనేత        107286     25.10
దివ్యాంగులు      621758            194.74
వితంతువులు  2064147                491.64
గీతకార్మికులు  31708       7.31
ట్రాన్స్ జెండర్లు  2079       0.70
మత్స్యకారులు 51816    12.29
వంటరి మహిళ   147482    34.91
చర్మకారులు      20663        4.87
డప్పు కళాకారులు  31429    9.67
ఎఆర్టీ పెన్షన్లు   31689      7.13
సికెడియు పెన్షన్లు 10897 10.90
డిఎంహెచ్ఓ పెన్షన్స్ 38101  20.08

మరిన్ని వార్తలు