పింఛన్ దుడ్లు ఎప్పుడిస్తారో..!

12 Apr, 2014 02:07 IST|Sakshi

 మహానేత వైఎస్‌ను స్మరించుకున్న వృద్ధులు
 
 బేతంచెర్ల, న్యూస్‌లైన్: వయస్సు పైబడిన వృద్ధులు.. ఆసరా లేని వికలాంగులు.. తోడు దూరమైన వితంతువులు.. వీరందరికీ నెల నెలా వచ్చే పింఛన్ ఎంతో ఆసరానిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లా.. వీరికీ ఠంచన్‌గా పింఛన్ మొత్తం అందించి పెద్ద కొడుకుగా.. తోబుట్టువులా వారి హృదయాలను చూరగొన్నారు.

 ఆయన మరణానంతరం పింఛన్ ఎప్పుడొస్తుందో తెలియక.. రోజూ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటికే 11 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛన్ ఇస్తారో లేదో తెలియక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అతి కష్టం మీద పొద్దున్నే కార్యాలయాలకు వస్తున్నారు. ఇంకా రాలేదని తెలిసి ఎండలో నిట్టూరుస్తూ ఇళ్లకు వె ళ్లిపోతున్నారు.

 దుడ్లు ఎప్పుడిస్తారోనని ఆశగా అడుగుతున్నారు. ఆ మహానేత జీవించి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కాదంటూ పలువురు పింఛన్‌దారులు ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ను గుర్తు చేసుకోవడం కనిపించింది. ఆ వైఎస్ దేవుడు లేకపోయినా.. ఆయన కొడుకు జగన్ అయినా వస్తే సక్రమంగా పింఛన్ దుడ్లు వస్తాయని మరింత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు