కోత పెట్టి.. కొత్తగా!

17 Aug, 2013 04:03 IST|Sakshi

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి:  ఎన్నికల పుణ్యమా! అంటూ గతంలో కోత పెట్టిన పింఛన్ల ను ప్రభుత్వం తిరిగి ఇచ్చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వివిధ కారణాలు చూపి జిల్లాలో 97వేల సామాజిక పింఛన్లను రద్దుచేసిన అధికారులు వచ్చే రచ్చబండ కార్యక్రమం ద్వారా 44,830 పిం ఛన్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా వయస్సు తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్లు, సదరన్ క్యాంపులు నిర్వహించి అంగవైకల్య శాతం తక్కువగా ఉందని పిం ఛన్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ‘బంగారు తల్లి’ పథకం అమలులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కొ త్త పింఛన్లను మంజూరుచేసే విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
 
 మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకుని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తే ఆయన మరణానంతరం వచ్చిన సీఎంలు కె.రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిలు గతంలో ఉన్న పలువురి పింఛన్లను తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో తిరస్కరించిన వికలాంగులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
 
 తొలగించిన పింఛన్లు ఇలా..
 అయితే జిల్లాలో జిల్లాలో దాదాపు 21వేల వికలాంగుల పింఛన్లు తొలగించారు. తిరిగి వారందరికీ పింఛన్లు మంజూరుకావాల్సి ఉండగా, అందులో కేవలం 2454 మంది వికలాంగులకు మాత్రమే పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు దాదాపు 43 వేలు తొలగించగా కొత్తగా 25,466 పింఛన్లు మంజూరు చేశారు. వితంతువులకు సంబంధించి 33వేల పింఛన్లను తొలగించగా..వాటి స్థానంలో ప్రస్తుతం 13,491 పింఛన్లు మంజూరుచేశారు.
 
 చేనేత, కల్లు గీత కార్మికుల పింఛన్లు కూడా అరకొరగానే ఇవ్వడంతో ఆయా వర్గాలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సార్వత్రిక ఎన్నిలు కూడా ఆ వెంటనే వచ్చే అవకాశం ఉండటం, ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తులపైనే జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో భయం పట్టుకుంది. కాగా, ఇటీవల నిర్వహించిన సొసైటీ, సర్పంచ్ ఎన్నికలు పార్టీల రహితంగా జరగడంతో ఎక్కువ స్థానాలు తమకే వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకుని సంబరపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలంటే వైఎస్ హయాంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ తిరిగి లబ్ధి చేకూర్చకపోతే ఇబ్బందులు తప్పవని భావించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. సునీతా ల క్ష్మారెడ్డి చేసిన ప్రకటనతో గతంలో పింఛన్లు కోల్పోయిన వికలాంగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు