‘వారికీ’ పింఛన్లు

26 Mar, 2018 13:10 IST|Sakshi

థర్డ్‌ జెండర్లకుపింఛన్లు

ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారికే అవకాశం

పత్రాల మంజూరులో జాప్యం

నిబంధనల పేరిట పింఛనుదారులను తగ్గించేప్రయత్నం  

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:జిల్లాలో థర్డ్‌ జెండర్‌ వర్గానికి ఈ ఏడాది నుంచి పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఆదేశాల అమలుకు ఎన్నో అడ్డంకులు ఎదురువస్తున్నాయి. దీనికి సంబంధించి పలు నిబంధనలతో కూడిన జీఓ నంబర్‌16ను ఈ నెల 5న విడుదల చేశారు. థర్డ్‌ జెండర్‌ వారికి వైద్య పరీక్షలుఅనంతరం వైద్యులు ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్ల మం జూరులో పారదర్శకత కనిపించడం లేదు. కేవలం అధికార పార్టీ అనుచరులకే పిం ఛన్లు మంజూరవుతున్నాయి. జన్మభూమి కమిటీ సిఫార్సులు ఉన్న వారికే పింఛన్లు ఇస్తుండడంతో వాస్తవ లబ్ధిదారులు తీవ్రం గా ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల కిడ్నీ రోగులకు కూడా పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటికి కూడా నిబంధనలు పెట్టడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో కిడ్నీ రోగులు 17 వేల మంది ఉండగా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్న 291 మందికి మాత్రమే పింఛను అందజేస్తున్నారు. ఇప్పుడు థర్డ్‌ జెండర్లకు కూడా ఇలాంటి మెలికలే పెడుతోంది. స్థానికతతో పాటు మెడికల్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది. అయితే రిమ్స్‌లో వీరికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి సిబ్బంది లేరు. జిల్లా వ్యాప్తంగా 1100 మంది థర్డ్‌ జెండర్‌ వారు ఉన్నట్లు అంచనా. వీరికి రిమ్స్‌లో ప్రాథమికంగా పరీక్షించి, ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడానికి ప్రత్యేక వైద్యులు ఉండాలి. ఎండోక్రైనాలజిస్టు, యూరాలజిస్టు, సైక్రియాసిస్టులు ఉండాలి.

అయితే ఎండోక్రైనాలజిస్టు లేరు. దీంతో విశాఖ నుంచి వారానికో రోజు ఆ వైద్యుడిని రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రిమ్స్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పద్ధతిని ఫాలో అయితే ధ్రువీకరణ పత్రాల మంజూరుకు చాలా కాలం పడుతుంది. దీనిపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు